- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాచలం, వెలుగు : ఈనెల 29,30 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వారదర్శనం ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. ముక్కోటి ఏర్పాట్లపై సోమవారం సబ్ కలెక్టర్ ఆఫీసులో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. అన్ని శాఖలవారీగా సమీక్ష నిర్వహించారు. పోలీసు,రెవెన్యూ, ఎండోమెంట్శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
మహోత్సవ పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లలో లోపాలు రాకూడదన్నారు. లాడ్జీ, హోటల్ యజమానులతో వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసి ధరలు నిర్ణయించాలన్నారు. ఆలయ పరిసరాల్లో సీసీ టీవీల ఏర్పాటు ప్రారంభించాలన్నారు. భద్రాచలం,పర్ణశాల దేవాలయాల్లో లైటింగ్ పెట్టాలని సూచించారు. ఉత్సవాల వీక్షణకు అనువుగా ఎల్ఈడీలు పెట్టాలన్నారు. హంసావాహనం తనిఖీ చేసి ధ్రువీకరణ నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా, హంసావాహనంపైకి పరిమిత సంఖ్యలో అనుమతించాలని సూచించారు.
శానిటేషన్ నిర్వహణ చక్కగా ఉండాలన్నారు. ఏరు ఫెస్టివల్తో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు గోదావరి తీరంలో ఏరు ఫెస్టివల్కు సంబంధించిన పాకల నిర్మాణాలు తక్షణమే ప్రారంభించాలన్నారు. ట్రైబల్ మ్యూజియం, బొజ్జిగుప్ప పర్యాటక ప్రాంతం , గోదావరిలో పుట్టి ప్రయాణం కోసం స్విమ్మర్లకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, ఏఈవో శ్రావణ్కుమార్, ఈఈ రవీంద్రనాథ్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
