ఢిల్లీ ప్రభుత్వాన్నే కాదు..పంజాబ్లో తమను కూడా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ అన్నారు. పంజాబ్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించకుండా గవర్నర్ అడ్డుతగిలారని చెప్పారు. మై గవర్నమెంట్ అని చదవనని గవర్నర్ చెప్పినట్లు వెల్లడించారు. కానీ సుప్రీంకోర్టు అలా కుదరదని చెప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థనే దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీకి సంబంధించి కేంద్ర ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాతమని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ ప్రజల హక్కుల కోసం తాము పోరాటం చేస్తున్నామని భగవంత్ మాన్ తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం అని..ఒకే పువ్వు ఉండటం కుదరదన్నారు. దేశం ఒక మాల లాంటిదని చెప్పారు. మాలలో అన్ని రకాల పూలు ఉంటాయని మాన్ సింగ్ స్పష్టం చేశారు.