
- ఏడాది లెక్కన 43శాతం పెరుగుదల..అంచనాలను అందుకోని టెల్కో
న్యూడిల్లీ: టెలికాం కంపెనీ ఎయిర్టెల్ నికరలాభం 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో (ఏప్రిల్-–జూన్) గత ఏడాదితో పోలిస్తే 43శాతం పెరిగి రూ.5,948 కోట్లకు చేరుకుంది. ఇది వరుసగా ఐదవ క్వార్టర్లోనూ పెరిగింది. అయితే, మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. మనీకంట్రోల్ నిర్వహించిన బ్రోకరేజ్ సర్వే ప్రకారం నికర లాభం రూ.8,169 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేశారు.
గత క్వార్టర్తో పోలిస్తే నికర లాభం 46శాతం తగ్గింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 28శాతం పెరిగి రూ.49,463 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.38,506 కోట్లుగా ఉంది. ప్రతి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) గత ఏడాది రూ.211 నుంచి రూ.250కి పెరిగింది. మొత్తం కస్టమర్ల సంఖ్య 6.6శాతం పెరిగి 43.6 కోట్లకు చేరుకుంది.
స్మార్ట్ఫోన్ డేటా వినియోగదారుల సంఖ్య 2.13 కోట్లు పెరిగింది. మొత్తం మొబైల్ కస్టమర్లలో వీరి వాటా 77శాతం ఉంది. ఈసారి ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ ఇబిటా 41.2శాతం పెరిగి రూ.28,167 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్ 56.9శాతంగా నమోదైంది. ఈ క్వార్టర్లో ఎయిర్టెల్ 1,800 కొత్త టవర్లు, 7,500 మొబైల్ బ్రాడ్బ్యాండ్ సైట్లను ఏర్పాటు చేసింది.
వ్యాపార విభాగాల పనితీరు
ఇండియా మొబైల్ బిజినెస్ విభాగం 2.9శాతం వృద్ధి సాధించింది. పోస్ట్పెయిడ్ కస్టమర్ల సంఖ్య 0.7 మిలియన్లు పెరిగి 26.6 మిలియన్లకు చేరింది. హోమ్స్ బిజినెస్ విభాగం బలమైన వృద్ధిని సాధించింది. దీని ఆదాయం 25.7శాతం పెరిగింది. రికార్డు స్థాయిలో 9,39,000 మంది కొత్త వైఫై కస్టమర్లను సంపాదించుకుంది. మొత్తం హోమ్ బ్రాడ్బ్యాండ్ కస్టమర్ల సంఖ్య 11 మిలియన్లకు చేరింది.
లాభాలు తక్కువగా ఉన్న కాంట్రాక్టుల నుంచి వైదొలగడంతో ఎంటర్ప్రైజ్ బిజినెస్ విభాగం విభాగం ఆదాయం 7.7శాతం తగ్గింది. ప్రధాన సేవలు, డిజిటల్ సేవల్లో వృద్ధి నిలకడగా ఉంది. డిజిటల్ టీవీ విభాగం రూ.763 కోట్ల ఆదాయాన్ని సాధించింది. కస్టమర్ బేస్ 1.57 కోట్లకు చేరింది. కొత్తగా ప్రారంభించిన ఐపీటీవీ సర్వీసుకు 0.65 మిలియన్ల కొత్త వినియోగదారులు లభించారని ఎయిర్టెల్ రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది.
కంపెనీ పనితీరుపై వైస్-ఛైర్మన్ ఎండీ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ, ‘‘వరుసగా మరో క్వార్టర్లో బలమైన వృద్ధి సాధించాం. మా బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉంది. ఇది బలమైన నగదు ప్రవాహానికి రుజువు’’అని పేర్కొన్నారు.