
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికే ఆదిలాబాద్నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పాదయాత్ర చేసింది తానే అయినా.. తనను నడిపించింది పార్టీలోని నేతలేనని చెప్పారు. శనివారం గాంధీభవన్లో "భట్టి పీపుల్స్మార్చ్ పాదయాత్ర" పుస్తకాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం కల్పించామని చెప్పారు.
మండుటెండలో అడుగులు పడుతున్నంత సేపు ఎంతో భయమేసిందని..అయినా తెగించి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేశానని చెప్పుకొచ్చారు. తన పాదయాత్రకు పేరు పెట్టింది ప్రజా యుద్ధనౌక గద్దర్ అని గుర్తుచేశారు. పాదయాత్రలో గద్దర్ అన్న ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ.. మాటలు చెప్తూ తనను ప్రోత్సహించారని తెలిపారు. చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ వెనుక గద్దర్ ఆలోచనలే ఉన్నాయన్నారు. ఆయన బతికుంటే ఆ సభలో ఎగిరి దూకి గంతులేసి ఆనందపడేవారని భట్టి పేర్కొన్నారు.
భట్టి పీపుల్స్ మార్చ్పాదయాత్ర మహాయాత్ర అని మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఆయన 110 రోజులపాటు నడిచి..పార్టీ బలోపేతానికి కృషి చేశారని ప్రశంసించారు. భట్టి వేసిన ప్రతి అడుగు కాంగ్రెస్విజయానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జోడో యాత్ర స్ఫూర్తితోనే భట్టి పాదయాత్ర కొనసాగిందని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, చిన్నారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.