రూ.163 కోట్ల పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రూ.163 కోట్ల పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఫైనాన్స్ ఆఫీసర్లను ఆదేశించిన  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ గురుకులాలు, ఇంటి అద్దె బకాయిలు, మధ్యాహ్న భోజన బిల్లులకు సంబంధించిన రూ.163 కోట్ల పెండింగ్ బిల్స్ వెంటనే రిలీజ్ చేయాలని ఆర్థిక శాఖ ఆఫీసర్లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం ప్రజా భవన్ లో ఆర్థిక శాఖ,  వివిధ సంక్షేమ శాఖల ఆఫీసర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో , వైవిధ్యంతో కూడిన ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురుకులాలు, వసతి గృహ విద్యార్థుల డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. భోజన నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పూర్తిస్థాయిలో పాటించాలని ఆఫీసర్లను ఆదేశించారు. 

ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించేందుకు ఆఫీసర్లు సడన్ విజిట్స్ చేయాలన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాలు, హాస్టళ్లు, ఇతర సంస్థలకు సంబంధించిన డైట్, అద్దె, కాస్మోటిక్స్ పెండింగ్​ బిల్స్ రూ. 51.36 కోట్లు, మైనారిటీ గురుకులాలు, ఇతర విద్యాసంస్థలకు సంబంధించిన డైట్, అద్దె బకాయిలు రూ.47.61 కోట్లు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.63.92 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.