- దేశం మొత్తానికి వైఎస్ ఆదర్శం: భట్టి విక్రమార్క
- ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధిని సందర్శించిన సీఎల్పీ నేత
హైదరాబాద్, వెలుగు: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్లోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకే ధారపోశారని, ఆయన వారసురాలిగా ఆమెకు వెల్కమ్ చెప్పాల్సిందేనని భట్టి స్పష్టం చేశారు. గురువారం ఏపీలోని ఇడుపులపాయలో ఉన్న రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. తన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా తనతో పాటు కలిసి వచ్చిన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది సహా 45 మందితో ఆయన తిరుపతికి వెళ్లారు. దారిమధ్యలో రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం, చదువు, ఆర్థిక కష్టాలు సహా రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి మంచి పథకాలను అమలు చేశారన్నారు. అతని ఆలోచనలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో వైఎస్ హయాంలో ఎమ్మెల్యేగా, చీఫ్ విప్గా పనిచేశానని, ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలోనూ పనిచేస్తున్నానని, అది తన అదృష్టమని భట్టి చెప్పారు.