భువనగిరి, ఆలేరు అభ్యర్థులను మారుస్తరట.. సొంత పార్టీలో మైండ్​ గేమ్​

భువనగిరి, ఆలేరు అభ్యర్థులను మారుస్తరట.. సొంత పార్టీలో మైండ్​ గేమ్​

యాదాద్రి, వెలుగు: ఎన్నికలు దగ్గరపడుతుండటంతో యాదాద్రి జిల్లాలోని బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలపై సొంత పార్టీలో మైండ్​ గేమ్​ మొదలైంది. భూవనగిరి, ఆలేరు అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆలేరులో బూడిద భిక్ష్మయ్య గౌడ్​కు,  భువనగిరిలో మరో నేతకు టికెట్​ఇస్తారని సోషల్​మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలతోపాటు క్యాడర్​ అయోమయానికి గురవుతోంది. 

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. 

మొదట్లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిని ఆలేరు కు మారుస్తారని, ఆలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతను కాకుండా ఆమె భర్త డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందనర్​రెడ్డికి టికెట్ ఇస్తారంటూ మునుగోడు ఉప ఎన్నికకు ముందు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని మహేందర్​రెడ్డి ఖండించి సునీతనే పోటీ చేస్తారని స్పష్టం చేశారు.  కానీ భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలోకి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్​లో చేరడంతో సీన్ మారిపోయింది.  ఆలేరు, భువనగిరి  ఎమ్మెల్యేలు వరుసగా రెండుసార్లు గెలవడంతో వారిపట్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సమఉజ్జీలు బీఆర్ఎస్​లో  లేరు. అయితే మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య తిరిగి బీఆర్ఎస్​లో  చేరడం, అనుకున్నట్టుగా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం తో ఆలేరులో ఎమ్మెల్యే గొంగిడి సు నీతకు సమఉజ్జీగా నిలబడ్డారు. గౌడ సామా జికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున ఆలేరు టికెట్ బూడిదకు ఇస్తారని ప్రచారం మొదలైంది. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిని తప్పించి మరోపార్టీకి చెందిన బలమైన క్యాండిడేట్​ను బీఆర్ఎస్​లో తీసుకొని రావడానికి ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేత ఒకరు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా భువనగిరికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ కు బలమైన అభ్యర్థి లేకుండా పోయారు. దీంతో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్​రెడ్డికి భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తారంటూ మరో ప్రచారం జరుగుతోంది. 

సోషల్ మీడియాలో లిస్ట్ వైరల్​

లీడర్ల మైండ్ గేమ్ లో భాగంగానే ఈ ప్రచారానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో కొత్త అభ్యర్థుల పేర్లతో కూడిన లిస్ట్ చక్కర్లు కొడుతోంది. ఆలేరుకు బూడిద భిక్షమయ్య గౌడ్, భువనగిరికి చింతల వెంకటేశ్వర్ రెడ్డి లేదంటే జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అభ్యర్థులుగా పేర్కొన్న లిస్ట్ ప్రస్తుతం వైరల్​గా మారింది. ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య లీడర్లే ఈ ప్రచార ప్రయోగం చేయిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితితో అటు ఎమ్మెల్యేలు.. ఇటు నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. 

ప్రోగ్రామ్స్​ సంఖ్య పెంచుతున్రు.. 

 బీఆర్​ఎస్​ తరుచూ అంతర్గత సర్వేలు చేస్తుండటం, ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీసుండటంతో ఇటీవల ఎమ్మెల్యేలు అటెండ్​ అయ్యే  ప్రోగామ్స్​సంఖ్య పెరుగుతోంది. నియోజకవర్గాల్లో తమకు సమఉజ్జీలూ లేరని, టికెట్ కచ్చితంగా తమకే వస్తుందని భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు భావిస్తు న్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుడే ప్రచారం జోరు పెంచారు. రెగ్యులర్​గా ప్రోగ్రామ్స్​ చేస్తూ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించే ప్రయత్నం చేస్తున్నారు.