ట్రిపుల్​ ఆర్​ అలైన్​మెంట్​ మార్చాలని భువనగిరి మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం

ట్రిపుల్​ ఆర్​ అలైన్​మెంట్​ మార్చాలని భువనగిరి మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం
  •     ట్రిపుల్​ ఆర్​ అలైన్​మెంట్​ మార్చాలని భువనగిరి మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం
  •      స్టేట్​, ఢిల్లీ లెవల్​లో ప్రయత్నించాలంటున్న ఎక్స్​పర్ట్స్​

యాదాద్రి, వెలుగు :  ట్రిపుల్​ ఆర్​  అలైన్​మెంట్​ మార్చాలని యాదాద్రి  జిల్లా భువనగిరి  మున్సిపల్​ కౌన్సిల్​లో  మెంబర్లందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.  చివరిదశకు వచ్చిన తర్వాత చేసిన తీర్మానంతో ఎంత వరకూ ఉపయోగమన్నది చర్చనీయాంశమైంది.  యాదాద్రి జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల రీజినల్​ రింగ్​ రోడ్డు(ట్రిపుల్​ఆర్​) వెళ్లనుంది. జిల్లాలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీ, వలిగొండ, చౌటుప్పల్​ మండలాల్లో 1,853.04 ఎకరాలను సేకరించాల్సి ఉంది. అయితే రీజినల్ ​రింగ్​ రోడ్డును యాదాద్రి జిల్లా బాధితులు ప్రధానంగా భువనగిరి మున్సిపాలిటీలోని రాయగిరి  ప్రజలు  మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బాధితులు నిరంతరం ఆందోళనలు చేస్తున్నా..  ట్రిపుల్​ఆర్​కు సంబంధించి సర్వే పూర్తి కావడంతో పాటు గెజిట్​ నోటిఫికేషన్​ కూడా వచ్చింది. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్​ నుంచి మద్దతు వస్తున్నా అధికార బీఆర్​ఎస్​ నుంచి సహకారం కరువైందని, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో పలుమార్లు ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పైగా మీడియా, సోషల్​ మీడియా వేదికగా ఎమ్మెల్యే శేఖర్​రెడ్డిపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. ఈ ఒత్తిడితో ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి మున్సిపాలిటీలో తీర్మానం చేయిస్తానని ఈమధ్య ఒక ప్రకటన విడుదల చేశారు. 

ప్రత్యేకంగా కౌన్సిల్​.. తీర్మానం

ట్రిపుల్​ ఆర్​ అలైన్​మెంట్ మార్పుపై ఎమ్మెల్యే  పైళ్ల  శేఖర్​రెడ్డి పర్యవేక్షణలో భువనగిరి మున్సిపల్ చైర్మన్​ ఎనబోయిన ఆంజనేయులు అధ్యక్షతన కౌన్సిల్​ గురువారం ప్రత్యేకంగా సమావేశమైంది.  నేషనల్​​ హైవే, కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు, హై టెన్షన్​ స్తంభాల  ఏర్పాటు సహా యాదగిరి గుట్ట రోడ్డు విస్తరణ కోసం రాయగిరి రైతులు గతంలో భూములు ఇచ్చారని కౌన్సిల్​లో మెంబర్లు చర్చించారు. పలుమార్లు భూములు కోల్పోయిన వీరి భూములే.. మళ్లీ ట్రిపుల్​ ఆర్​ కోసం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అలైన్​మెంట్​ను రాయగిరి మీదుగా కాకుండా వేరే ప్రాంతం నుంచి మార్చాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. 

నేషనల్​ హైవే ఆఫీసర్లను ఒప్పిస్తే..

ట్రిపుల్​ ఆర్​ భూసేకరణ అంశం చివరిదశకు వచ్చింది.  రైతుల అభిప్రాయాలను నేషనల్​ హైవే ఆఫీసర్లు తోసిపుచ్చారు.  భువనగిరి మినహా మిగిలిన చోట్ల ఫైనల్​ గెజిట్​ వచ్చినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం పేర్కొన్న అలైన్​మెంట్​ ఫైనల్​ అన్న  స్టేజికి వచ్చేసింది.  అలైన్​మెంట్​ ప్రపోజల్​ వచ్చిన టైంలోనే.. జిల్లాలోని అన్ని చోట్ల తీర్మానం చేయడంతోపాటు స్టేట్​ లెవల్​లో ఎమ్మెల్యేలు, అధికార పార్టీ లీడర్లు నేషనల్​ హైవే ఆఫీసర్లను కన్విన్స్​​ చేసి ఉంటే.. కొంత ప్రయోజనం ఉండేదని అంటున్నారు. అదే విధంగా లీగల్​గానూ బాధితులకు సాయంగా నిలబడితే ప్రయోజనం ఉండేదంటున్నారు. ఇప్పటికీ స్టేట్, ఢిల్లీ​ లెవల్లో ప్రయత్నించి నేషనల్​ హైవే ఆఫీసర్లను ఒప్పించాలని,  ఇవేమీ చేయకుండా తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే లాభంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.