న్యూఢిల్లీ: టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లు ఆడటమే తన లక్ష్యమని స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. అందుకు తగ్గట్లుగానే తన ప్రిపరేషన్స్ ఉంటాయన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన టీమ్లో భువీకి చోటు దక్కలేదు. పైగా గాయాల వల్ల కొంత కాలంగా అతను జట్టులోకి వస్తూపోతూ ఉన్నాడు. దీంతో ఐదు రోజుల ఫార్మాట్పై భువనేశ్వర్కు ఇంట్రెస్ట్ లేదని శనివారం కథనాలు వచ్చాయి. వీటిని ఖండించిన భువీ.. ట్విటర్ ద్వారా తన కెరీర్పై క్లారిటీ ఇచ్చాడు. ‘నేను టెస్ట్లకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. టీమ్ సెలెక్షన్ సంగతి ఎలా ఉన్నా.. మూడు ఫార్మాట్లలో ఆడాలన్నదే నా లక్ష్యం. ఆ విధంగానే నా ప్రిపరేషన్స్ ఉంటాయి. ఇక మీద కూడా అవి కొనసాగుతాయి. ఆధారాల్లేకుండా వచ్చిన కథనాలను నమ్మి తప్పుడు ప్రచారం చేయొద్దు’ అని భువనేశ్వర్ ట్వీట్ చేశాడు.