- డాలీ నౌకలోని భారతీయ సిబ్బందిపై బైడెన్ ప్రశంస
వాషింగ్టన్: ‘మీరు నిజమైన హీరోలు.. మీ అప్రమత్తత వల్లే చాలా మంది ప్రాణాలు దక్కాయ్’ అని వంతెనను ఢీకొన్న డాలీ నౌకలోని భారత సిబ్బందిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారు. మంగళవారం ఉదయం వాణిజ్య నౌక ఢీకొట్టడంతో బాల్టిమోర్లోని పటాప్ స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనపై బైడెన్ బుధవారం స్పందించారు.
షిప్లోని సహాయక సిబ్బందితోపాటు 22 మంది భారత సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘నౌక నియంత్రణ కోల్పోగానే సిబ్బంది అప్రమత్తమయ్యారు. మేరీలాండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కు సమాచారం అందించారు. దీంతో స్థానికఅధికారులు బ్రిడ్జిపైకి ఎవరూ రాకుండా ట్రాఫిక్ను నిలిపేశారు. చాలామంది ప్రాణాలు కాపాడగలిగారు’ అని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి బైడెన్ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే వంతెన పునర్నిర్మాణ పనులు చేపడుతామని చెప్పారు.
ఇది అతి భయానక ఘటన అని, దీని వెనుక వేరే దేశాల ప్రమేయం ఉన్నట్టు తాము అనుమానించడం లేదని అన్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన నౌక గ్రేస్ ఓసియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినదని అధికారులు పేర్కొన్నారు. బాల్టిమోర్నుంచి కొలంబోకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ఈ షిప్లోని 22 మంది సిబ్బంది భారతీయులేనని, అందరూ సేఫ్ గానే ఉన్నారని షిప్ మేనేజ్మెంట్ కంపెనీ సినర్జీ మెరైన్ గ్రూప్ వెల్లడించింది.
గల్లంతైన ఆరుగురు మృతి!
నౌక బ్రిడ్జిని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతిచెందినట్టు అధికారులు భావిస్తున్నారు. డాలీ నౌక ఇంజిన్ పవర్, ఎలక్ట్రిక్ పవర్ పూర్తిగా జీరో కావడంతోనే కంట్రోల్ తప్పి బ్రిడ్జిని ఢీకొట్టినట్టు తెలిపారు. ఈ సమయంలో బ్రిడ్జిపై ఉన్న ఆరుగురు రిపేయిర్ మెన్స్ నదిలో పడిపోయారని, వెంటనే సిబ్బంది రెస్క్యూ చర్యలు చేపట్టారని వెల్లడించారు.