
- మీర్పేట పీఎస్లో కౌన్సెలింగ్సెంటర్ ప్రారంభం
ఎల్బీనగర్, వెలుగు: నేర రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ‘వికల్ప్’ ఏర్పాటుకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు చేసిన కృషి అభినందనీయమని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. మీర్పేట పీఎస్లో ట్రాన్స్ జెండర్స్ కౌన్సెలింగ్ సెంటర్ ‘వికల్ప్’ ను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కేంద్రం ద్వారా ట్రాన్స్జెండర్లకు ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామన్నారు. ఇది ట్రాన్స్ జెండర్లలో గొప్ప మార్పును తీసుకొస్తుందన్నారు.
ట్రాన్స్జెండర్లు కూడా సమాజంలో భాగమని, వారికి అందరూ అండగా నిలబడాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పిలుపునిచ్చారు. వికల్ప్ ద్వారా నేరశాతం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్లు సమాజంలో ధైర్యంగా తలెత్తుకుని నిలబడాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రజ్వల సంస్థ ఫౌండర్ సునీతా కృష్ణన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాచకొండ జాయింట్ సీపీ సత్యనారాయణ, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, పోలీస్ అధికారులు, సిబ్బంది, ట్రాన్స్ జెండర్స్ పాల్గొన్నారు.