
- చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరిందని వెల్లడి
వాషింగ్టన్: ఇండియాతో త్వరలో చాలా పెద్ద డీల్ కుదుర్చుకోబోతున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్హౌస్లో శుక్రవారం జరిగిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ఈవెంట్లో ఆయన ఈ కామెంట్లు చేశారు. ‘‘చైనాతో అగ్రిమెంట్ కుదిరింది. డాక్యుమెంట్లపై సంతకాలు కూడా చేసేశా. ఇక నెక్స్ట్ ఇండియానే.. చాలా దేశాలు మాతో ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికాతో ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకుంటున్నాయి. మాతో కలిసి ముందుకెళ్లాలని చాలా దేశాలు భావిస్తున్నాయి.
అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో కొన్ని నెలల కింద మీడియాలో చాలా నెగిటివ్ వార్తలు వచ్చాయి. అసలు యూఎస్తో ఒప్పందం చేసుకోవడానికి నిజంగా ఎవరైనా ఆసక్తి చూపిస్తున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి నన్ను ప్రశ్నించాడు. ఇప్పుడు వాళ్లకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. రెండు రోజుల కిందే చైనాతో ట్రేడ్ డీల్ ఓకే అయింది. ఇక ఇండియాతోనూ త్వరలో చాలా పెద్ద అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. మేము ఇండియాలో మార్కెట్లను తెరవబోతున్నాం’’ అని ట్రంప్ అన్నారు.
కొన్ని దేశాలతోనే ఒప్పందాలు చేసుకుంటాం
అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో కొన్ని దేశాలకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ట్రంప్ ప్రకటించారు. ‘‘అమెరికా.. కొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా లేదు. వారితో ఎలాంటి ట్రేడ్ డీల్స్ ఉండవు. కొన్ని దేశాలకు కేవలం ఒక లేఖ పంపి.. 25, 35, లేదా 45 శాతం పన్నులు చెల్లించమని చెప్తాం. అదే సులువైన మార్గం’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాతో ఒప్పందం ద్వారా ఇండియా మార్కెట్ను మరింత జోరందుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియాతో వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచడంతో పాటు మార్కెట్ యాక్సెస్, సుంకాల తగ్గింపు వంటి అంశాలపై అమెరికా ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.