నిమ్స్ పటాకుల కేసు క్లోజ్! భవిష్యత్తులో ఎవిడెన్స్ దొరికితే తెరుస్తామన్న పోలీసులు

నిమ్స్ పటాకుల కేసు క్లోజ్! భవిష్యత్తులో ఎవిడెన్స్ దొరికితే తెరుస్తామన్న పోలీసులు
  • రెండు నెలల కింద నిమ్స్లో ఫైర్ యాక్సిడెంట్​
  • అప్పుడే ఆరోగ్యశ్రీ వార్డులో పటాకులు ఉన్నాయంటూ వీడియో వైరల్​
  • అవి తీసింది అడిషనల్ మెడికల్​సూపరింటెండెంట్​
  • దర్యాప్తులో ఆధారాలు లభించలేదన్న పోలీసులు 
  • టెంపరరీగా కేసు క్లోజ్​ చేశామంటూ చార్జ్​షీట్​

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: పంజాగుట్టలోని నిమ్స్​ దవాఖానలో ఏప్రిల్​19న ఫైర్​ యాక్సిడెంట్​జరగ్గా, అప్పుడే అదే ఫ్లోర్​లోని ఆరోగ్యశ్రీ రూమ్​లో క్రాకర్స్​ ఉన్నాయంటూ సోషల్ ​మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొట్టేసింది. దీనిపై అప్పట్లో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో తమకు ఎటువంటి ఆధారాలు లభించనందున కేసును తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. భవిష్యత్​లో ఏదైనా ఆధారాలు లభిస్తే కేసు రీఓపెన్​ చేస్తామని పేర్కొన్నారు.

ఆ వీడియోలు ఒక్కటే..
రెండు నెలల కింద నిమ్స్లోని ట్రామా కేర్​ బిల్డింగ్​5వ ఫ్లోర్​లో ఫైర్​ యాక్సిడెంట్​జరిగింది. అదే రోజు అదే ఫ్లోర్​లోని ఆరోగ్యశ్రీ గదిలో పటాకులున్నాయంటూ ఓ వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది. దీనిపై దవాఖాన అడిషనల్ ​మెడికల్​ సూపరింటెండెంట్​లక్ష్మీభాస్కర్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు మూడు వీడియోలు దొరికాయి. ఈ వీడియోలను ఘటన జరిగిన రోజు అడిషనల్​ మెడికల్​ సూపరింటెండెంట్ ఎం క్రిష్ణారెడ్డి తీసినట్టు తెలిసింది. వైరల్​అయిన వీడియోలను, కృష్ణా రెడ్డి మొబైల్‌‌లో ఉన్న వీడియోను వెరిఫై చేయగా, రెండూ ఒక్కటే అని తేలింది. కృష్ణా రెడ్డి మొబైల్‌‌లో మరో వీడియో ఉన్న ఇది వాట్సాప్‌‌లో షేర్ కాలేదని తెలిసింది.  

వీడియోల్లో ఏముందంటే.. 
1 నిమిషం 44 సెకన్లున్న వీడియోలో ఓ వ్యక్తి వీడియో తీస్తున్నట్టు ఉంది. మొదట ఆరోగ్య శ్రీ పేరుతో ఉన్న ఆఫీసు రూమ్ కనిపించింది. లోపలకు వెళ్లగా అక్కడ లగేజీ ఉన్న కర్టన్, చాలా లగేజీ బ్యాగులు ఉన్నాయి. వాటిపైన ఒక బాక్సు ఉండగా, దాన్ని తెరవడంతో ఫైర్​క్రాకర్స్​కనిపించాయి. తర్వాత మళ్లీ బయటకు వెళ్లిన వ్యక్తి డోర్​ను వీడియో తీశాడు. ఈ షేర్​చేసిన వీడియోలోని సీన్లే కృష్ణారెడ్డి దగ్గర ఉన్న ఒరిజినల్​వీడియోలోనూ ఉన్నాయి. దీన్ని బట్టే కృష్ణారెడ్డి ఆ వీడియో తీశారని నిర్ధారించారు. మరో వీడియోలో ఎరుపు, పసుపు బ్యాగులు కనిపించడం, పక్కనే కొన్ని బాక్సులు, దాని పక్కనే ఫైర్​క్రాకర్​బాక్సులు కనిపించాయి. అలాగే రూమ్​లోని కంప్యూటర్స్​ను వీడియో తీసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. షేర్​చేయని మరో వీడియో 2 నిమిషాల 23 సెకన్లు ఉండగా, అందులో కార్డ్​బోర్డ్​బాక్స్​తెరవడం, అందులోని ఫైర్​క్రాకర్స్​తీసి ఫ్లోర్​పై, లగేజీ బ్యాగులపై పెట్టడం ఉంది. 

సరైన ఆధారాలు దొరకలేదని..
పోలీసుల పూర్తి దర్యాప్తులో ఎవరు క్రాకర్స్​పెట్టారో తెలియడం లేదని తేల్చారు. అన్ని వీడియోలు, వీడియోలను తీసిన వారిని, అక్కడి స్టాఫ్, ఉన్నతాధికారులను విచారించామని, సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసును తాత్కాలికంగా మూసివేస్తున్నామని కోర్టుకు ఇచ్చిన ఛార్జ్​షీట్​లో పేర్కొన్నారు. లక్ష్మీభాస్కర్​ను నోటీసులు ఇచ్చామని చెప్పారు. భవిష్యత్తులో గనక ఏవైనా ఆధారాలు దొరికితే కేసు రీ ఓపెన్​చేసి దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

దర్యాప్తులో ఏం తేలిందంటే..
అగ్ని ప్రమాదం తర్వాత అడిషనల్​ మెడికల్​సూపరింటెండెంట్​ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపి ఘటనాస్థలానికి సమీపంలోని ఆరోగ్యశ్రీ  ఆఫీసుకు వెళ్లారని దర్యాప్తులో తేలింది. గదిలో సామాన్లతో పాటు కార్డ్​బోర్డ్ బాక్స్​ను చూసి  మూడు వీడియోలు తీశారు. వాళ్లు వెళ్లిపోతుండగా, ఆరోగ్యశ్రీ ఆఫీసు సిబ్బంది శివ శంకర్ రావు, బాలకృష్ణ రెడ్ది, కుమార్ తమ డ్యూటీ అయిపోయిందని ఆఫీసును లాక్ చేసి వెళ్లిపోబోయారు. దీంతో కృష్ణారెడ్డి గది తాళం తీసుకుని అక్కడే ఉన్న సిబ్బంది నాగులుకు ఇస్తానని, అతను దానిని సెక్యూరిటీకి అందజేస్తాడన్నారు. కొద్దిసేపటికే మరో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్​లక్ష్మీ భాస్కర్కు శివ శంకర్ రావు ఫోన్ చేసి కృష్ణారెడ్డికీ తీసుకున్నాడని, వీడియోలు తీశాడని చెప్పాడు.

కొద్దిసేపటికే ఆ వీడియోలు నిమ్స్​ డాక్టర్​ అండ్​ మీడియా గ్రూపులో షేర్​ అయ్యాయి. ఇవి చూసిన లక్ష్మీభాస్కర్ శివ శంకర్​కు ఫోన్​ చేశాడు. ఆరోగ్యశ్రీ రూమ్​లో తన సామాన్లు ఉన్నాయని, నాగులు నుంచి కీ తీసుకురావాలని కోరాడు. ఆయన చెప్పినట్టే చేయగా లక్ష్మీభాస్కర్​ ఆరోగ్యశ్రీ రూమ్​లోకి ఎంటర్​ అయ్యాడు.  తర్వాత అక్కడున్న నాలుగు బ్యాగులను తీసుకున్నాడు. అయితే, లక్ష్మీభాస్కర్​ రూమ్లోకి వెళ్లాక వీడియోలో ఉన్న క్రాకర్స్​ కనిపించలేదని పోలీసులకు చెప్పాడు. అక్కడి స్టాఫ్​ కూడా ఎవరు క్రాకర్స్​పెట్టారో.. ఎవరు తీశారో తమకు తెలియదని పోలీసులకు చెప్పారు.