
బిగ్బాస్ 7 ఫ్యాన్స్ వీరంగం కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు జూబ్లిహిల్స్ పోలీసులు.ఇక రైతుబిడ్డ, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసేలా పనిలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రశాంత్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో..3 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.
ఈ కేసులో ప్రశాంత్ని A-1 గా, అతని సోదరుడు మనోహర్ ను A -2గా, A-3గా ఫ్రెండ్ వినయ్ని చేర్చారు. డ్రైవర్లు సాయి, రాజేష్ లను A-4 గా చేర్చి అరెస్ట్ చేశారు.ఇక ప్రశాంత్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడం కోసం పోలీసులు అన్ని చోట్ల ఆరా తీసున్నారు. పోలీసుల అనుమానం ప్రకారం సిద్ధిపేట జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉన్నట్లు సమాచారం తెలుసుకుని..పోలీసులు అక్కడికెళ్లినట్లు తెలుస్తోంది. ఏ తప్పు చేయకపోతే ప్రశాంత్ దాక్కోవడం ఏంటనీ కొందరు నెటిజన్స్ ప్రశాంత్పై ఫైర్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకొన్న ప్రశాంత్..తీరా ఫేమ్ వచ్చాక చేసిన రచ్చ వల్ల వచ్చిన ఇమేజ్ పూర్తిగా పోయేలా చేసుకున్నట్లు నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇక ప్రశాంత్ తరుపు లాయర్ జూబ్లీహిల్స్ పీఎస్కు వచ్చి కేసు వివరాలు సేకరించనున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు స్పందించకపోతే డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రశాంత్ లాయర్ రాజ్కుమార్ సిద్దమయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి కేసుల వివరాలు ఆన్లైన్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగింది..
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ప్రకటన తర్వాత ఆదివారం (డిసెంబర్ 17) అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు రెచ్చిపోయి ఆరు సిటీ బస్సులపై దాడిచేసి అద్దాలు పగులగొట్టారు. బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట పోలీస్ వెహికల్ తో పాటు బెటాలియన్ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద హంగామా సృష్టించారు. ఇరు వర్గాల రాళ్ల దాడిలో పలు కార్ల అద్దాలు పగిలిపోయాయి. రన్నరప్గా నిలిచిన అమర్ దీప్ కారుపై కూడా కొందరు దాడి చేశారు. పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు. బిగ్బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.