కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ వ్యాపించకుండా ఉండాలంటే..పెళ్లిల్లు, ఇతర సామాజిక కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు. బీహార్ లో 10 రోజుల లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత..దీనికి సంబంధించి ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.ఇవాళ్టి(బుధవారం) నుంచి మే 15 వరకు కొవిడ్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాము కల్పించుకోవాల్సి వస్తుందని పాట్నా హైకోర్టు హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించారు సీఎం నితీష్ కుమార్. లాక్డౌన్ నిబంధనల ప్రకారం..వివాహాలకు 50 మందికి మించి పాల్గొనకూడదు, అంత్యక్రియల్లో 20 మంది లోపు మాత్రమే పాల్గొనాలి. అవసరమైన సేవలకు మాత్రమే అనుమతించారు. ఉదయం 7 నుండి 11 గంటల మధ్య మాత్రమే కిరాణా షాపులు కొనసాగించేందుకు అనుమతి ఉంది.