
- రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తరు
- ఇప్పటివరకూ 4 కోట్ల ఇండ్లు నిర్మించి ఇచ్చామని వెల్లడి
- బిహార్లోని పూర్నియాలో టూర్
- సీమాంచల్ ప్రాంతంలో తొలి ఎయిర్పోర్ట్ ఓపెన్
పాట్నా: ఆర్జేడీ, కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనతో బిహార్కు తీరని నష్టం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రస్తుతం ఎన్డీయే హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారు ఓర్వలేకపోతున్నారని అన్నారు. సోమవారం బిహార్లోని పూర్ణియా జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించారు. జాతీయ పూల్మఖానా బోర్డుతోపాటు రూ. 36 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు బిహార్ తల్లులు, సోదరీమణులు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. దేశ అభివృద్ధి, భద్రతలో బిహార్ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను పట్టించుకోరని, తమ కుటుంబాల గురించే ఆరాటపడతారని విమర్శించారు. కానీ తాను ‘సబ్కా సాథ్ సబ్ కా విశ్వాస్’ను నమ్ముతానని చెప్పారు. పేద ప్రజలకు మద్దతు ఇవ్వడమే తన మోటో అన్నారు. ఇందులో భాగంగానే పేద ప్రజలకు ఇప్పటివరకూ 4 కోట్ల పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు. త్వరలో మరో 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. రైతులకు ప్రయోజనం కల్గించేందుకు జాతీయ పూల్ మఖానా బోర్డు ఏర్పాటుకు
కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.
చొరబాటుదారులు వెళ్లిపోవాల్సిందే..
రాష్ట్రంలోకి చొరబాటుదారులను ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. కానీ, న్డీయే సర్కారు వారిని తరిమికొడ్తుందని చెప్పారు. బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆర్జేడీ, కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. బిహార్ గుర్తింపును కూడా ఆ పార్టీలు నాశనం చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి చొరబాటుదారులను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. విదేశాల నుంచి వచ్చిన వారి కోసం ఇలాంటి యాత్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బిహార్ ప్రజలు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని సూచించారు. చొరబాటుదారులు ఎవరైనా వెళ్లిపోవాల్సిందేనని హెచ్చరించారు.
సీమాంచల్లో తొలి ఎయిర్పోర్ట్ ప్రారంభం
బిహార్లోని సీమాంచల్ ప్రాంతం పూర్నియాలో ఏర్పాటుచేసిన ఫస్ట్ ఎయిర్పోర్ట్ను మోదీ ప్రారంభించారు. తర్వాత ఎయిర్పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ను ఆయన సందర్శించారు. ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను ఉడాన్స్కీమ్కింద ఏర్పాటు చేశారు. ఇది సీమాంచల్ ప్రాంతంలో మొట్టమొదటి ఎయిర్పోర్ట్. ఇది ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేసి, ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి
తోడ్పడనున్నదని ఎన్డీయే సర్కారు చెబుతున్నది.
బిహార్ ప్రజలను బీడీలతో పోలుస్తూ అవమానిస్తున్నరు
బిహార్ ప్రజలను బీడీలతో పోలుస్తూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అవమానిస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ కేరళ యూనిట్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ నుద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ విధానాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ కేరళ యూనిట్ ఓ ట్వీట్ చేసి తర్వాత డిలీట్ కొట్టింది. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘‘ఇది బిహార్ను, రాష్ట్ర ప్రజలను అవమానించడమే. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి రాష్ట్ర ప్రజలు తగిన జవాబిస్తారు” అని వ్యాఖ్యానించారు.