ఆటోను బైక్ ఢీకొని ఇద్దరు మృతి

ఆటోను బైక్  ఢీకొని ఇద్దరు మృతి
  • ఒకరికి తీవ్ర గాయాలు
  • హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో ప్రమాదం

హసన్ పర్తి, వెలుగు : ఆటోను బైక్  ఢీకొని ఇద్దరు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పోలీస్ స్టేషన్ కు కూతవేటులో దూరంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. హసన్ పర్తి సీఐ తుమ్మ గోపి వివరాల ప్రకారం... హనుమకొండ గుండ్ల సింగారం గ్రామానికి చెందిన భూక్య రజిత (45) తన బంధువులతో కలిసి ఆటోలో వేములవాడ దర్శనానికి వెళ్లింది. మంగళవారం అర్ధరాత్రి తిరిగి వెళ్తుండగా హసన్ పర్తి డలం కేంద్రంలోని నల్లగట్టుగుట్ట వద్దకు రాగానే.. ఆటోను రాయల్  ఎన్​ఫీల్డ్ బైక్  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రజిత తీవ్రంగా గాయపడింది.

బైక్  వెనకాల కూర్చున్న కాటం శివశంకర్  తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రజితను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయింది. బైక్  నడుపుతున్న చిట్యాల సంపత్ కు తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సీఐ తుమ్మ గోపి వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతులను ఎంజీఎం మార్చురీకి తరలించారు. సంపత్  చికిత్స పొందుతున్నాడు. సంపత్, శివశంకర్  హసన్ పర్తికి చెందిన వారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.