
హైదరాబాద్, వెలుగు: అంతరిక్ష పరిశోధనల స్ఫూర్తితో టెక్నాలజీ డెవలప్మెంట్, పర్యావరణ పరిరక్షణ కోసం భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి హైదరాబాద్లో బుధవారం బయోఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ 2025 సదస్సు మొదలయింది. ఈ కార్యక్రమానికి ప్రపంచ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు భారీగా సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐటీ, పరిశ్రమల స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు. బయోమిమిక్రీ, అంతరిక్ష ఆవిష్కరణలు, సుస్థిర ఆర్థిక అభివృద్ధి మధ్య సంబంధాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. అంతరిక్ష పరిశోధనలు భూమిపై అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయో ఈ కార్యక్రమంలో చర్చిస్తారు.
గ్లోబల్ ఈవెంట్స్ ఆఫ్ పయనీరింగ్ అండ్ అడ్వాన్సింగ్ క్వెస్ట్స్ (జియోప్యాక్) చెక్ ఏరోస్పేస్ క్లస్టర్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆవిష్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచంలోనే అతిచిన్న వయస్కురాలైన అనలాగ్ వ్యోమగామి ఇనియా ప్రగతి ఈవెంట్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.