తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్చుగ్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీకి అండగా నిలబడాలని తాను అన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. బీఆర్ఎస్ను ఓడించే సత్తా బీజేపీకి ఉన్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వదంతులు వ్యాప్తి చేయడం మానుకోవాలని తరుణ్ చుగ్ మీడియాకు సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలున్నందున టీడీపీ.. తమ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా పలు పార్టీలతో పొత్తులకు పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. టీడీపీతో తాము పొత్తు పెట్టుకోబోమని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలు తేల్చిచెప్పారు. అయితే టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ ఆలోచిస్తున్నదని తరుణ్ చుగ్ అన్నట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ అంశం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో టీడీపీతో పొత్తు లేదని, తాను అలా అనలేదని తరుణ్ చుగ్ క్లారిటీ ఇచ్చారు.