
- బీసీల నోటికాడికి వచ్చిన ముద్దను లాగేసుకున్నరు
- గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై బండి సంజయ్, ఈటల, అర్వింద్ నోరు విప్పాలి
- 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని వెల్లడి
నిజామాబాద్, వెలుగు : స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణలో మొదటిసారి కులగణన చేపట్టి.. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు తీసుకొస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్కు కడుపుమండి అడ్డుకుంటున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే లోకల్బాడీ ఎలక్షన్స్కు వెళ్తామని తెలిపారు. వెనుకబడిన వర్గాలను ముందువరుసలోకి తేవడానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు.
శనివారం మహేశ్ గౌడ్ నిజామాబాద్లోని ఆర్అండ్బీ గెస్ట్హౌజ్లో మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ‘‘42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్సిద్ధమైతే.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అడ్డుపడ్తున్నయ్. బీసీల నోటిదాకా వచ్చిన ముద్దను లాగేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే రద్దు కోసం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని సర్కారు నిర్ణయించింది. దేని ఆధారంగా రిజర్వేషన్లు పెంచారని అడిగితే శాస్త్రీయబద్ధంగా నిర్వహించిన కులసర్వే తాలూకు క్లియర్ డేటా చూపేందుకు గవర్నమెంట్ రెడీగా ఉన్నది” అని తెలిపారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా 42 శాతం రిజర్వేషన్ అమలుకావాలనే రాహుల్గాంధీ ఆశయాన్ని సక్సెస్ చేసేందుకు సీఎం రేవంత్ పనిచేస్తున్నారని చెప్పారు. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు ఢిల్లీలో ధర్నా నిర్వహించి.. రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తే తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు మాత్రమే వెళ్లారని, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాకుండా వ్యతిరేకతను స్పష్టం చేశారని వ్యాఖ్యానించారు. గవర్నర్వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై బీసీ నేతలైన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ లు ఈటల రాజేందర్, అర్వింద్ ధర్మపురి నోరువిప్పాలని డిమాండ్ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రిజర్వేషన్ సాధించేదాకా పోరాడుతామని స్పష్టం చేశారు.
నిజామాబాద్ టు ముంబైకి ప్రధాన రైలు మార్గం..
హైదరాబాద్ నుంచి ముంబై వయా నిజామాబాద్ ప్రధాన రైలు మార్గం కాబోతున్నదని మహేశ్గౌడ్ తెలిపారు. డబుల్ లైన్ నిర్మాణంతో రైళ్లు నడువబోతున్నాయని, పనులు స్పీడ్గా జరిగేలా ఎంపీలు చొరవ చూపాలని కోరారు. వేములవాడ మధ్య నుంచి కొండగట్టు, ధర్మపురి, లింబాద్రిగుట్ట, బాసర వరకు కొత్త రోడ్ వేయాలని సీఎంను కోరామన్నారు.
తెలంగాణ వర్సిటీలో గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి.. జిల్లా ప్రజల కోరిక మేరకు ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజీ కూడా శాంక్షన్ చేశారని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ల ప్రాధాన్యతను ఢిల్లీ లెవెల్కు పెంచాలని హైకమాండ్ నిర్ణయించిందని మహేశ్గౌడ్ తెలిపారు. సమర్థులను గుర్తించి డీసీసీ పోస్టు అప్పగించేందుకు ప్రత్యేక పరిశీలకులను ఏఐసీసీ అపాయింట్ చేసిందన్నారు.
ఈ టీం సభ్యులు ఆదివారం నుంచి వారంపాటు స్టేట్లోని జిల్లాల్లో పర్యటించి పేర్లను సేకరిస్తారని, వారిపై ఎవరి ఒత్తిళ్లు పనిచేయవన్నారు. వాయిదా పడ్డ కామారెడ్డి బీసీ సభను త్వరలో నిర్వహిస్తామని మహేశ్గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులున్నారు.
మైల కడుక్కునే పనిలో హరీశ్
రాయలసీమను రతనాల సీమ చేస్తానని సీఎం హోదాలో ఏపీకి నాడు కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేయడానికి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు హరీశ్రావు బనకచర్ల నిర్మాణానికి అడ్డగోలు జీవోలు ఇచ్చారని మహేశ్ గౌడ్ ఆరోపించారు. ఏపీ ప్రజల హక్కులు కాపాడడానికి తెలంగాణకు అన్యాయం చేశారని, ఇప్పుడవన్నీ బయటపడడంతో .. హరీశ్రావు ఆ మైల కడుక్కునే పని షురూ చేశారని ఎద్దేవా చేశారు.