
కామారెడ్డి జిల్లా కేంద్రం మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వ మూర్ఖ వైఖరికి ఒక రైతు బలి కావడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో అడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన రైతు పయ్యావుల రాములుది ఆత్మహత్య కాదని.. అది ప్రభుత్వ హత్యే అని ఆయన ఆరోపించారు. బుధవారం రైతు మృతదేహం తరలింపు విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతమని జిల్లా కలెక్టర్, పోలీసులు భావించకూడదన్న ఆయన.. చట్టబద్ధంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు ఇవాళ కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళితే పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామీకమని బండి సంజయ్ విమర్శించారు. బారికేడ్లు, కంచెవేసి రైతుల్ని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఉగ్రవాదులుగా, సంఘవిద్రోహ శక్తులుగా పరిగణిస్తోందని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వంలో సీఎంకు ఎవరినీ కలిసే తీరిక లేదని.. కనీసం జిల్లా కలెక్టర్లకు కూడా రైతుల్ని కలిసే సమయం లేదా అని ప్రశ్నించారు. పట్టణానికి మాస్టర్ ప్లాన్ అవసరం అనుకున్నప్పుడు ముందుగా ప్రభుత్వ భూములు, రాళ్లు రప్పల భూమిని సేకరించాలని.. కానీ పంటలు పండే రైతుల వ్యవసాయ భూముల్ని లాక్కోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
వెంటనే కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు రాష్ట్ర మంత్రులు రైతులతో చర్చలు జరపాలని బండి సంజయ్ సూచించారు. మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ విషయంలో రైతులతో చర్చించి అవసరమైన మార్పులు చేయాలన్నారు. మాస్టర్ ప్లాన్ అలైన్ మెంట్ మార్చకుండా ఇట్లాగే మూర్ఖంగానే ముందుకు వెళ్తే జరగబోయే పరిణామాలకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అని గుర్తు చేస్తున్నాను అన్నారు. రైతులు చేపట్టబోయే ఆందోళనకు బీజేపీ మద్దతు కొనసాగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.