
- ఇండ్లు వచ్చినా ధర్నాకు దిగిన 30 మంది
- వచ్చిన డబుల్ఇండ్లు పోతాయని బెదిరించడంతోనే..
ఘట్ కేసర్, వెలుగు : ఘట్కేసర్మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతాప్ సింగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన స్థానికులకే కేటాయించాలంటూ బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లతో కలిసి పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. ఇందులో లిస్టులో ఇండ్లు వచ్చిన 90 మందిలో 30 మంది ఈ ధర్నాలో పాల్గొన్నారు. గతంలో స్థానికుల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించగా, 90 ఇండ్లను మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి తన అనుచరులకు, పార్టీ కార్యకర్తలకు, అనర్హులకు కేటాయించారన్న ఆరోపణలు వచ్చాయి.
త్వరలో గృహ ప్రవేశం ఉందని వార్తలు రావడంతో మూడు రోజులుగా గ్రామంలో రెండు వర్గాలకుగా చీలిపోయి పోటా పోటీగా ఆందోళనలు చేస్తున్నారు. ఆదివారం బీఆర్ఎస్మాజీ సర్పంచ్ శివశంకర్ ఆధ్వర్యంలో మహిళలు, పెద్ద సంఖ్యలో అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కంటెస్టెడ్ఎమ్మెల్యే మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అక్కడికి వచ్చి ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు.
తర్వాత అంబేద్కర్ చౌరస్తా నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ కూడా రోడ్డుపై బైఠాయించారు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు కూడా జత కలిసి నిరసన తెలిపారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఏకపక్షంగా, ఎంక్వైరీ చేయకుండా అనర్హులకు ఇండ్లు ఇచ్చారని, అర్హులకు ఇవ్వకపోతే లైన వారికి మాత్రమే ఇండ్లు కేటాయించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాజీ సర్పంచ్ శివశంకర్ మాట్లాడుతూ 90 మందితో సెలెక్ట్చేసిన లిస్టులో అనర్హులే ఎక్కువ మంది ఉన్నారని, పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయించాలని కోరారు.
నిరసన విషయం తెలుసుకున్న మేడిపల్లి సీఐ గోవర్ధన్ రెడ్డి అక్కడకు వచ్చి ఆందోళన విరమించాలని కోరారు. అయినా వినకపోవడంతో అరెస్ట్చేసి స్టేషన్కు తరలించారు. కాగా, ఈ ధర్నాలో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు డబుల్ బెడ్ రూమ్ లిస్టులో పేర్లున్న వారు పాల్గొన్నారని, వచ్చిన ఇండ్లు పోతాయని కొందరు బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నాలో కూర్చున్నారని కాంగ్రెస్ లీడర్నత్తి కృష్ణ అన్నారు.