ఈస్ట్​ సిటీలో బీజేపీ క్లీన్‌స్వీప్‌

ఈస్ట్​ సిటీలో బీజేపీ క్లీన్‌స్వీప్‌
  • రాజేంద్రనగర్ లోనూ ఆధిపత్యం
  • కుత్బుల్లా పూర్‌, శేరిలింగంపల్లిలో కారు జోరు
  • సిటీ శివార్లలో మిశ్రమ ఫలితాలు

హైదరాబాద్‌, వెలుగుజీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శివార్లలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కొన్ని చోట్ల ఓటర్లు బీజేపీని ఆదరిస్తే, మరికొన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ కు పట్టం కట్టారు. ఎల్బీనగర్‌, మహేశ్వరంలోని సీట్లన్నీ బీజేపీ కైవసం చేసుకుంది. రాజేంద్రనగర్‌  సెగ్మెంట్​లో సగానికిపైగా బీజేపీ గెలుచుకుంది. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ లోని డివిజన్లలో టీఆర్‌ఎస్‌ మెజార్టీ సాధించింది. మెయిన్‌ సిటీతో పోలిస్తే శివారులో పోలింగ్‌ పర్సంటేజ్‌ ఎక్కువగా నమోదు కాగా.. టీఆర్ఎస్, బీజేపీకి చేరి సగం సీట్లు దక్కాయి.

ఎల్బీనగర్‌లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌..

ఎల్బీనగర్‌ పరిధిలోని అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. చైతన్యపురి, గడ్డి అన్నారం, నాగోల్‌, మన్సూరాబాద్‌, చంపాపేట్‌, వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌, హస్తినాపురం, లింగోజిగూడ స్థానాలను గెలుచుకుంది.  మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు స్థానాలైన సరూర్‌నగర్‌, మహేశ్వరంలోనూ కమలం పార్టీ గెలుపొందింది. 2016 ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకోగా, అందులో ఆర్కేపురం డివిజన్‌ కూడా ఉంది. ఎన్నికలకు ముందు భారీ వర్షాలకు ఎల్బీనగర్‌లోని చాలా ప్రాంతాలు వరదలకు ఆగమయ్యాయి. టీఆర్‌ఎస్‌ నేతలు కనీసం పట్టించుకోలేదని, అందుకే ఇక్కడ టీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజేంద్రనగర్‌లోనూ బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఐదింటిలో మూడు స్థానాలను కైవసం చేసుకుంది.

కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లిలో ..

కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి పరిధిలో టీఆర్‌ఎస్‌ మెజార్టీ సాధించింది. కుత్బుల్లాపూర్‌లో 8 డివిజన్లు ఉండగా, ఏడింటిని టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్‌,  చింతల్, సూరారం, సుభాష్‌నగర్‌‌, కుత్బుల్లాపూర్‌ లో టీఆర్ఎస్ గెలవగా.. బీజేపీ జీడిమెట్లలో గెలిచింది. శేరిలింగంపల్లిలో 10 డివిజన్లు ఉండగా, టీఆర్‌ఎస్‌ 9 సీట్లను కైవసం చేసుకుంది. కొండాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్, చందానగర్, వివేకానంద నగర్ కాలనీ, హైదర్‌నగర్‌, అల్విన్ కాలనీ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. ఐటీ కారిడార్‌ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. ఆయా డివిజన్లలో తక్కువ ఓటింగ్‌ నమోదు కావడం టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చినట్లు చెప్తున్నారు. ఐటీ ప్రాంతాలైన మాదాపూర్, మియాపూర్‌, కొండాపూర్‌, హఫీజ్‌పేట్‌, చందానగర్‌, బంజారాహిల్స్‌, శేరిలింగంపల్లి డివిజన్లలో గులాబీ పార్టీ మరోసారి సత్తా చాటింది. ఐటీ కారిడార్‌ ప్రాంతాల్లో ఒక్క గచ్చిబౌలి స్థానంలో మాత్రమే బీజేపీ గెలిచింది.  పటాన్ చెరులోని మూడు సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంది. మల్కాజిగిరి లోని  9 డివిజన్లలో 5 సీట్లను టీఆర్ఎస్, మూడింటిని బీజేపీ గెలుచుకోగా, ఒక స్థానంలో రిజల్ట్ ను పెండింగ్ లో పెట్టారు. మూసాపేట, మౌలాలిలోనూ బీజేపీ విజయం సాధించింది.