
ఢిల్లీలో నేడు పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్
పార్టీ ముఖ్య నేతలను కలిసిన స్టేట్ చీఫ్ రాంచందర్రావు
న్యూఢిల్లీ, వెలుగు:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక్లలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఆదివారం ఖరారు చేసే అవకాశాలున్నాయి. దీనిపై పార్టీ కసరత్తు చేస్తున్నది. ఆదివారం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో బోర్డు సభ్యులైన పలువురు కేంద్ర మంత్రులు, తెలంగాణకు చెందిన ఎంపీ లక్ష్మణ్, తదితరులు పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సహా, ఎమిది రాష్ట్రాల్లో జరగనున్న బైపోల్స్ లో బరిలో దించనున్న అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ రాంచందర్రావు శనివారం ఢిల్లీ వెళ్లి పలువురు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.
బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, ఇతర నేతలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడడం, పార్టీ పరిస్థితిపై ముఖ్యనేతలకు వివరించినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఆయన జాతీయ నాయకత్వానికి అందజేసినట్లు సమాచారం.
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డితో భేటీ..
ఢిల్లీ పర్యటనలో భాగంగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని స్టేట్బీజేపీ ఛీప్ఎన్.రాంచందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలపై చర్చించారు.
కమిటీలో అదనపు పోస్టులకు నో
బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆఫీస్ బేరర్ల సంఖ్యను పెంచేందుకు పార్టీ హైకమాండ్ నో చెప్పింది. సంప్రదాయంగా, నిబంధనల ప్రకారం పార్టీ ఆఫీస్ బేరర్ లతో ఇటీవల పార్టీ కమిటీని వేసింది. అయితే, ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగిన కారణంగా అదనంగా వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ పోస్టులు ఇవ్వాలని పార్టీ హైకమాండ్ ను రాంచందర్ రావు కోరారు.
అయితే, ఈ అదనపు పోస్టులతో జంబో లిస్ట్ కు హైకమాండ్ నిరాకరించింది. అలాగే, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కూడా పరిమిత సంఖ్యలో తీసుకోవాలని సూచించింది. దీంతో ఇటు పార్టీలో పదవులు ఆశిస్తున్న వారికి నిరాశ మిగలగా.. పార్టీ చీఫ్ కు కొంత ఎదురుదెబ్బ తగిలినట్లయిందని పార్టీ నేతలు భావిస్తున్నారు.