ఏపీలో పొత్తులపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో పొత్తులపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పొలిటికల్ వాతావరణం వేడెక్కింది.  పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పొత్తులపై స్పందించారు. ఏపీలో బీజేపీ పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఏపీలో పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో త్వరలోనే ఎన్డీఏలోకి కొత్తమిత్రులు వస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబాలకే ఫ్యామిలీ ప్లానింగ్ కానీ రాజకీయాల్లో కూటమిలో ఎంత మంది సభ్యులుంటే అంత బలమని అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ కూటమిలోని మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.  కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామని బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలిపారు.

ఎన్డీఏ కూటమిలో నుంచి టీడీపీ, అకాలీదళ్, శివసేన పార్టీలు గతంలో బయటకు వచ్చేశాయి. 2014 ఏపీ శాసనసభ ఎన్నికలకు బీజేపీతో కలిసి వెళ్లారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వారికి మద్దతు ప్రకటించింది.  2019 లో ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీచేశాయి. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి.

ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుపై రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా.. 2014లో మాదిరిగానే మూడుపార్టీలు జతకడతాయా.. అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఢిల్లీలో అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చలు జరిపారు. అయితే చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. దీంతో ఏపీ పాలిటిక్స్ కాస్తా ఓవర్ టు ఢిల్లీగా మారిపోయింది. అయితే ఇలాంటి సమయంలోనే పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.