భద్రాచలం, వెలుగు : ఛత్తీస్గఢ్లోని రాజ్నందగావ్ జిల్లా సర్కేడ గ్రామంలో శనివారం మావోయిస్టులు బీజేపీ లీడర్ బిర్జూ తారమ్ను కాల్చి చంపారు. మోహ్లామాన్పూర్ నియోజకవర్గంలో బిర్జూ శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాత్రి ఆయన తన ఇంట్లో నిద్రిస్తుండగా శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు బిర్జూ ఇంట్లోకి చొరబడ్డారు. అతి సమీపం నుంచి ఆయనపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేశారు.
గతంలో రెండుసార్లు ఆయనను మావోయిస్టులు హెచ్చరించారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు.. సర్కేడ గ్రామానికి చేరుకుని బిర్జూ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. సమీప అడవుల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బిర్జూ హత్యతో ఛత్తీస్గఢ్లో రాజకీయ నేతలు భయాందోళనకు గురవుతున్నారు. మారుమూల గ్రామాల్లో ప్రచారం చేయడానికి జంకుతున్నారు.