హైదరాబాద్, వెలుగు: మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు అన్నారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఆ కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. గురువారం బీజేపీ స్టేట్ఆఫీస్లో పార్టీ మేనిఫెస్టోపై జరిగిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు.
అన్ని వర్గాల ప్రజలతో సమావేశాలను నిర్వహించి మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై చర్చిస్తామని చెప్పారు. వారి అభిప్రాయాలనూ తీసుకుంటామన్నారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ అభిప్రాయాల సేకరణ కోసం ఎల్ఈడీ వాహనాలను తిప్పుతామన్నారు.
మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలను ప్రజలు చెప్పాలనుకుంటే 90909 02024 నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే.. తిరిగి ఫోన్ చేస్తామన్నారు. ఆ తర్వాత ప్రజలు చెప్పే సలహాలను రికార్డ్ చేసుకుంటామన్నారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి నమో యాప్ లో అప్ లోడ్ చేస్తామన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది నుంచి అభిప్రాయాలను సేకరిస్తామని చెప్పారు.