
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాని మోడీ, ఎంపీ లక్ష్మణ్ లపై మంత్రి కేటీఆర్ దిగజారి మాట్లాడడం సిగ్గుచేటని బీజేపీ నాయకురాలు రాణి రుద్రమదేవి మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆమె .. సెస్ లో గెలుస్తారో.. ఓడుతారో తెలియక భయంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై మాట్లాడితే కోపం ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. చెప్పులు, చీపుర్లతో కొడతా అని మాట్లాడడం మంత్రి స్థాయికి తగదన్నారు. బండి సంజయ్ తంబాకు తింటాడని మాట్లాడారు.. మరి దీనిపై కూడా మీరు చెప్పుదెబ్భలు తింటారా.? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గురించి మాట్లాడే స్థాయి మంత్రి కేటీఆర్ కు లేదని విమర్శించారు.
తీగల గుట్ట ఆర్వోబీ గురించి బీఆర్ఎస్ ఎంపీ చేయలేని పనిని బండి సంజయ్ తీసుకొచ్చారని రాణి రుద్రమదేవి తెలిపారు. సహకార ఎన్నికల్లో ఏం చేస్తారో చెప్పకుండా మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏంటి ఆమె అని ప్రశ్నించారు. సిరిసిల్లలో రూ.600 కోట్ల సొమ్మును ఎవరు వాడుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ పార్టీని.. నేతలను విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణలో ప్రతి లిక్కర్ చుక్కలో కేసీఆర్ ముఖం కనిపిస్తోందని అన్నారు. మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మంత్రి కేటీఆర్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.