ఎన్ని కంపెనీలొచ్చాయో కేటీఆర్ చెప్పాలె: బీజేపీ నేత విఠల్

ఎన్ని కంపెనీలొచ్చాయో కేటీఆర్ చెప్పాలె: బీజేపీ నేత విఠల్

రాష్ట్రానికి మస్తు పెట్టుబడులు వస్తున్నాయంటున్న కేటీఆర్.. ఇప్పటివరకు ఎన్ని కంపెనీలొచ్చాయో చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ డిమాండ్ చేశారు. TSPSC లో 25 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు, మరో 30 లక్షల మంది బయట ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయని జాబ్ నోటిఫికేషన్ లు వేశారని చెప్పిన ఆయన.. ఉద్యోగాల భర్తీ ఎప్పటి లోగా పూర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఐటీ హబ్ అంటారుని కానీ.. ఎన్ని కంపెనీలు తెచ్చారో, అందులో రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని నిలదీశారు. కంపెనీల ఏర్పాటు కోసం భూములు, కరెంట్, టాక్స్ మినహాయింపు, రోడ్లు ఇలా అన్ని సౌలతులు సర్కార్ ఇస్తుంది.  మరి నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

సెల్ఫ్ ఎంప్లాయి మెంట్ కల్పించడంలో కూడా రాష్ట్ర సర్కార్ ఫెయిల్ అయ్యిందని విఠల్ ఆరోపించారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆత్మహత్యల్లో తెలంగాణ ముందంజలో ఉందని విమర్శించారు. స్థానిక యువతకు ఉపాది కల్పించాలని జీవో ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ పై సర్కార్ ఎందుకు ఖర్చుచేయడం లేదని.. బీటెక్ చదివిన పిల్లలు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా ఆ ప్రభుత్వం చట్టం చేసిందని.. మహారాష్ట్ర కర్ణాకట, మధ్యప్రదేశ్ లో 80 శాతం స్థానికులకు కల్పిస్తున్నాయని గుర్తు చేశారు.