ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

చెన్నూర్,వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామి శుక్రవారం చెన్నూర్​ మండలంలో పలు కుటుంబాలను పరామర్శించారు. చెన్నూర్​కు చెందిన బీజేపీ కార్యకర్త రాపర్తి వెంకన్న ఇటీవల బైక్ యాక్సిడెంట్​లో గాయపడగా, వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. జెండావాడకు చెందిన సిరంగి సంతోష్ మరణించగా, మృతదేహం వద్ద నివాళులర్పించి బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. మండలంలోని వెంకంపేటకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఐత హేమంతరెడ్డి తల్లి ఇటీవల మృతి చెందారు. తొమ్మిదో రోజు సందర్భంగా వారి కుటుంబాన్ని వివేక్​ వెంకటస్వామి పరామర్శించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్​, నాయకులు నగునూరి వెంకటేశ్వర్లుగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్​, భీమారం మండల అధ్యక్షుడు శ్రీనివాస్​ తదితరులు ఉన్నారు.  

హిందూ ఉత్సవ కమిటీ ఎన్నిక

భైంసా, వెలుగు: భైంసా హిందూ ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా విలాస్​గాదేవార్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్​ముష్కం రామకృష్ణగౌడ్, ట్రెజరర్​గా  కొర్వ చిన్నన్న, ధర్మకర్తగా భబ్రు మహారాజ్, ఉపాధ్యక్షులుగా మల్లేశ్, కాండ్లి సాయినాథ్, అల్లకొండ సాయినాథ్, గాలి రాజు, నాగనాథ్, గంగాధర్, గోపాల్​సార్డా, పాపన్న, భోజన్న  ఎన్నికయ్యారు. సహా కార్యదర్శులుగా డాక్టర్​కుమార్ యాదవ్, గోపాల్​ సూత్రవే,  రేవోజీ నర్సయ్య, తాడివార్​ సాయినాథ్, మీడియా ఇన్​చార్జీలుగా పెరుగు నవీన్, కాసరి రామకృష్ణ ఎన్నికయ్యారు. వినాయక, దుర్గాదేవీ నవరాత్రుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పండుగల ప్రశాంత వాతావరణంలో జరుపుకుందామని పిలుపునిచ్చారు.

నిర్వాసితులకు న్యాయం చేయాలి

నస్పూర్,వెలుగు: శ్రీరాంపూర్ ఓసీపీ నిర్వాసితులకు న్యాయం చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన తాళ్లపల్లి, సింగపూర్ గ్రామాలకు చెందిన పలువురు నిర్వాసితులు, ఓసీపీ కాంట్రాక్ట్ కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. సింగరేణి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సత్రం రమేశ్, ముదాం గోపాల్, కుర్రే చక్రి, సామ్రాజ్ రమేశ్, మద్ది సుమన్, తాడురి మహేశ్, మడిషెట్టి మహేశ్, జంగంపల్లి మహేశ్, కొంతం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి తీరు బాగాలేదు 

నస్పూర్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి సంస్థ పూర్తిగా లొంగిపోయిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తమ్మల రాజారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఏరియాలోని ఎస్​ఆర్పీ 3వగనిపై జరిగిన గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే సంస్థ డబ్బులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కార్మికుల క్వార్టర్ల రిపేరు, తాగడానికి మంచినీరుకు డబ్బులు ఖర్చు పెట్టడానికి మాత్రం డబ్బులు లేవంటారని ఆవేదన వ్యక్తం చేశారు. స్ట్రక్చర్, సేఫ్టీ సమావేశాలకు యాజమాన్యం అన్ని యూనియన్లను పిలవాలని డిమాండ్​ చేశారు. మారు పేర్లు, సూటబుల్ జాబ్​ తదితర డిమాండ్లను అమలు చేయకుండా ఎన్నికల కోసం ఆలస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి గోదారి భాగ్యరాజు, బాలాజీ, కస్తూరి చంద్రశేఖర్,  వెంకటేశ్వర్లు, రాజయ్య, సుధాకర్, శ్రీనివాస్,  రాజేశం తదితరులు పాల్గొన్నారు.

టీచర్ల నియామకాలు చేపట్టాలి: యూటీఎఫ్​

నిర్మల్,వెలుగు: ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి టీచర్ల  నియామకాలు చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర  కార్యనిర్వాహక అధ్యక్షుడు  ఎ. మురళీ మనోహర్ రెడ్డి కోరారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో శుక్రవారం ఆయన యూనియన్ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా పాఠశాలల్లో టీచర్ల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయన్నారు. ఫలితంగా విద్యాబోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. టీచర్లకు దీర్ఘకాలంగా ప్రమోషన్స్ లేకపోవడంతో నష్టపోతున్నారన్నారు. ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ వెంటనే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోడిశెట్టి రవికాంత్, ట్రెజరర్​పోల ధర్మరాజు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరిపె శివప్రసాద్, మేడారం శ్రీనివాస్, బట్టోలి ముత్తన్న, శరత్ చందర్ రెడ్డి, రాథోడ్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ బహిరంగ సభను సక్సెస్​ చేయాలి 

మంచిర్యాల, వెలుగు: బీజేపీ స్టేట్​ చీఫ్​ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం హన్మకొండలోని ఆర్డ్స్​ కాలేజీ గ్రౌండ్​లో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు కోరారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా చీఫ్​గెస్ట్​గా హాజరవుతారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా ఆఫీసులో ప్రెస్​మీట్​ ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్​ స్కాంలో టీఆర్‌‌ఎస్‌‌ నేతలపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్​ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటున్నారని అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బహిరంగ సభను విజయవంతం చేసి తీరుతామన్నారు. మంచిర్యాల నుంచి పెద్ద సంఖ్యలో సభకు తరళివెళ్తామన్నారు. 

స్టూడెంట్లకు స్కూల్​ కిట్లు అందజేత... 

హాజీపూర్​ మండలం గడ్​పూర్​లోని జడ్పీ హైస్కూల్​ టెన్త్​ క్లాస్​ స్టూడెంట్లకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​రావు శనివారం స్కూల్ కిట్లు అందించారు. రానున్న రోజుల్లో గవర్నమెంట్​ స్కూళ్లలో చదువుకుంటున్న పేద విద్యార్థులందరికీ బ్యాగులు, బుక్స్​ ఇస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వంగపల్లి వెంకటేశ్వర్​రావు, పొనుగోటి రంగారావు, పెద్దపెల్లి పురుషోత్తం, పానుగంటి మధు, మాసు రజిని, పైడిమల్ల నర్సింగ్, జోగుల శ్రీదేవి, బొద్దున మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.  

భైంసాలో పోలీసుల హైఅలర్ట్​

భైంసా,వెలుగు: భైంసా పట్టణంలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గత అల్లర్లను దృష్టిలో ఉంచుకొని పొలాల అమావాస్య, సందల్,​వినాయక చవితి, దుర్గాదేవి, దసరా పండుగల దృష్టిలో ఉంచుకొని డేగ కన్నేశారు. సీఐ ప్రవీణ్​కుమార్​ఆధ్వర్యంలో డ్వాగ్, బాంబ్​స్క్వాడ్​తో తనిఖీలు చేపట్టారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రార్థన మందిరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నాలుగు చోట్ల పికెట్ ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసులు కంటిన్యూ విధులు నిర్వహిస్తున్నారు. ఏఎస్పీ కిరణ్  ఖారే సీసీ కెమెరాల ద్వారా పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ పీవో పర్యటన

ఖానాపూర్,వెలుగు: పెంబి మండలం వేణునగర్, అంకునిమాడ, కోసగుట్ట, పల్గం పండ్రి  గిరిజన  గ్రామాల్లో శుక్రవారం ఐటీడీఏ  పీవో వరుణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మేల్యే రేఖా నాయక్​పర్యటించారు. గిరిజనులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ ఎంపీపీ గంగా రెడ్డి, లీడర్లు నరేందర్ రెడ్డి, విలాస్, ఎంపీడీవో  శేషాద్రి, ఎంపీవో రత్నాకర్ రావు తదితరులు ఉన్నారు.

గర్భిణుల ఆరోగ్యంపై అలర్ట్​గా ఉండాలి

ఆదిలాబాద్,వెలుగు: గర్భిణిలను ప్రసవానికి ముందే హాస్పిటల్ కు తరలించాలని, కొవిడ్ ప్రికాషన్ డోస్ అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం ఆమె భీంపూర్​పీహెచ్​సీని తనిఖీ చేశారు. ప్రసూతీ వార్డు, లేబర్ రూం, రికార్డులను పరిశీలించారు. గ్రామీణులకు క్వాలిటీ ట్రీట్మెంట్​ అందాలన్నారు. గవర్నమెంట్​హాస్పిటళ్లలో నార్మల్​డెలీవరీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. క్షయ బాధితులను గుర్తించి వైద్య సేవలు అందించాలన్నారు. సీజనల్​వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డాక్టర్లు రౌండ్​ద క్లాక్​అందుబాటులో ఉండాలన్నారు. ప్రతీ ఆశ్రమ పాఠశాలకు ఏఎన్ఎంలను కేటాయించి వైద్య సేవలు అందించాలన్నారు. అనంతరం రిమ్స్ హాస్పిటల్ లోని ఎన్ఆర్​సీ, చిల్డ్రన్‌‌, ఐసీయూ, ఆర్థోపెడిక్ వార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెడెంట్ అశోక్, భీంపూర్ మెడికల్ ఆఫీసర్ విజయసారథి, జడ్పీటీసీ సుధాకర్, స్పెషల్ ఆఫీసర్ గోపికిషన్ 
ఉన్నారు. 

ఘనంగా పొలాల పండుగ

ఉమ్మడి జిల్లాలో శుక్రవారం పొలాల అమావాస్య ఘనంగా నిర్వహించారు. ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించి  ఆలయాల చుట్టూ ఊరేగించారు. అనంతరం పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. ఇంద్రవెల్లి మండలం సమ్మక్క గ్రామంలో జరిగిన వేడుకల్లో ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి ఎడ్లకు పూజలు చేశారు. భైంసాలో వేడుకలు కన్నుల పండువగా సాగాయి. వస్తున్న కిసాన్​ గల్లీలోని నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

- వెలుగు ఫొటో గ్రాఫర్స్/ కాగజ్​నగర్​/భైంసా, వెలుగు

గోదావరిలో బోటింగ్​ షురూ 

మంచిర్యాల, వెలుగు:  లక్సెట్టిపేట పట్టణ సమీపంలోని గోదావరి నదిలో తెలంగాణ టూరిజం డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో తాత్కాలిక బోటింగ్​ను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు శుక్రవారం ప్రారంభించారు. బోటులో లక్సెట్టిపేట గోదావరి తీరం నుంచి కోటిలింగాల వరకు ఎమ్మెల్యే, నాయకులు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రస్తుతం ఒక స్పీడ్ బోడ్ మాత్రమే ఉంటుందని, కోటిలింగాలలో ఉన్న బోటింగ్​ ఇన్​చార్జికి ఫోన్ చేయగానే బోట్​ వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, టీఆర్​ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, మార్కెట్ కమిటీ చైరపర్సన్ సంధ్య జగన్మోహన్​రెడ్డి, బోటింగ్ ఇన్​చార్జి శ్రీనివాస్​రాజు పాల్గొన్నారు.  

వీఆర్​ఏల ఆందోళన ఉధృతం  

మంచిర్యాల, వెలుగు: పే స్కేల్​తో పాటు సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ నెల రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనను ఉధృతం చేస్తామని వీఆర్​ఏలు తెలిపారు. కలెక్టరేట్​ దగ్గర చేపట్టిన 48 గంటల వంటావార్పు కార్యక్రమం శనివారం ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న వీఆర్​ఏలు భారీ సంఖ్యలో తరలివచ్చి రెండు రోజులపాటు తమ ఆందోళన కొనసాగించారు. 

ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్​  ఎన్నిక 

మంచిర్యాల, వెలుగు: తెలంగాణ రాష్ర్ట ఆర్​ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్​ అసోసియేషన్​ జిల్లా నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బైపాస్​ రోడ్డులోని హరిత ఫంక్షన్​హాల్​లో జరిగిన ఎన్నికలకు స్టేట్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పి.సత్యనారాయణ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా డి.మొండయ్య, ఉపాధ్యక్షుడిగా ఎస్​.రాములు, ప్రధాన కార్యదర్శిగా ఎస్​.శ్రీనివాస్​, సహాయ కార్యదర్శిగా కె.రాజు, కోశాధికారిగా టి.రాజేందర్​ ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారుగా బెంజ్​మెన్​, సమన్వయకర్తగా ఎం.రాజమౌళి, సలహాదారులుగా ఈఎన్​.మూర్తి, కె.శంకర్​, ప్రచార కార్యదర్శులుగా పి.రమణ, బి.శ్రీనివాస్​ ఎన్నికయ్యారు. స్టేట్​ ప్రెసిడెంట్​ పి.వెంకన్న, జనరల్​ సెక్రటరీ జి.బాల్​రాజ్​ పాల్గొన్నారు.  

మూడు నెలల్లో కలెక్టరేట్ పూర్తిచేయాలి: మంత్రి

నిర్మల్,వెలుగు: నిర్మల్​కలెక్టరేట్​భవన నిర్మాణ పనులు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి నిర్మాణ పనులు పరిశీలించారు. పనులు క్వాలిటీగా ఉండాలన్నారు. కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరు తెలుసుకున్నారు. ఇంజినీర్లతో మాట్లాడారు. పనుల పురోగతికి సంబంధించిన నివేదికలు ఎప్పటి కప్పుడు తనకు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, రామకృష్ణారెడ్డి, అల్లోల మురళీధర్ రెడ్డి, పాకాల రామచందర్, ఆర్డీవో తుకారాం, డీఎస్పీ జీవన్ రెడ్డి  పాల్గొన్నారు.