
- బీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు
- బాల్క సుమన్కు ఎవ్వరూ భయపడొద్దు.. తాను అండగా ఉంటానని భరోసా
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన పవర్ కట్ చేస్తానని హామీ
- చెన్నూరు ఎమ్మెల్యే అరాచకాలపై వివేక్ ఎదుట వాపోయిన పలు గ్రామాల ప్రజలు
చెన్నూరు ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ పాలన అంతం అయితేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఆ పార్టీని ఓడించేందుకు జనం సిద్ధమయ్యారని చెప్పారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కత్తెరశాల, అంగ్రాజ్ పల్లి , ఎర్రగుంట్ల, పొక్కూర్, కొమ్మెర, బీరెళ్లి, జైపూర్ మండలంలోని నర్వ, రసూల్ పల్లి, ముదిగుంట, కాన్కూర్, మిట్టపల్లి గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వివేక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సంద్భరంగా వివేక్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చెన్నూరు ప్రాంతానికి ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే.. ఇక్కడి కాంట్రాక్టర్లకు ఉపాధి కల్పిస్తానని చెప్పిన కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును ఆంధ్రా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి అప్పగించి రూ.వేల కోట్ల కమీషన్ దండుకున్నారని ఆరోపించారు. మరోవైపు, పాత పైపులకు రంగేసి మిషన్ భగీరథ పేరుతో రూ.40 వేల కోట్లను కేసీఆర్ దోచుకున్నారన్నారు.
తెలంగాణ వచ్చాక రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం.. కేసీఆర్ అవినీతి పాలన కారణంగా రూ.6 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారిందన్నారు. రాష్ట్రంలో పుట్టబోయే ప్రతి బిడ్డపైనా రూ.లక్ష అప్పు భారం పడుతోందని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశతో తెలంగాణ ప్రజల సొమ్మును ఆయా రాష్ట్రాల్లో ఖర్చు చేశారని మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రూ.వెయ్యి కోట్లు, ఏపీ, పంజాబ్ రాష్ట్రాల్లో రూ.500 కోట్ల చొప్పున ప్రజాధనం అక్కడ ఖర్చు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు.
పోలీసులను వాడుకొని ఇబ్బంది పెడుతుండు..
సమస్యలపై ప్రశ్నించిన ప్రజలు, ప్రతిపక్ష నేతలపై బాల్క సుమన్ తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని, ఇందుకు పోలీసులను వాడుకుంటున్నారని వివేక్ ఫైర్ అయ్యారు. జైపూర్ మండలం నర్వ గ్రామంలో పంచాయతీ ఎన్నికల సమయంలో తమ అభ్యర్థి ఓడిపోతాడనే భయంతో గ్రామానికి చెందిన 25 మందిపై అక్రమంగా కేసులు పెట్టి వేధింపులకు దిగిన అహంకారికి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుమన్ పవర్ కట్ చేసి, ఆయనను జైలుకు పంపిస్తామన్నారు.
కాళేశ్వరంలో రూ.70 వేల కోట్లను కేసీఆర్ దండుకుంటే ఆయన దత్తపుత్రుడైన బాల్క సుమన్ ఇసుక దందాతో రూ.వేల కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. ఇసుక వ్యాపారంలో ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులను బాల్క సుమన్ తన సొంత ఖజానాకు మళ్లించారని ఆరోపించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో చెన్నూరు నియోజకవర్గంలో వేల ఎకరాల పంట భూములు మునిగిపోతే.. బాధిత రైతులకు నష్టపరిహారం ఇప్పించే సోయి సుమన్కు లేదన్నారు.
మీరైనా మా బాధలు తీర్చాలి..
‘‘మా ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఎప్పుడూ చూడలేదు. ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఐదేండ్లలో ఒక్కసారి కూడా మా గ్రామానికి రాలేదు. మా సమస్యలు వినేందుకు కూడా అందుబాటులో లేడు. మీరు గెలిచిన తర్వాతైనా మా బాధలు తీరుతాయని ఆశ పడ్తున్నాం’’అని చెన్నూరు, జైపూర్ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు వివేక్ వెంకట స్వామి ఎదుట వాపోయారు. ఆయా గ్రామాల్లో వివేక్, నల్లాల ఓదెలుకు డీజే చప్పుళ్లు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ వల్ల తాము పడుతున్న ఇబ్బందులను గ్రామస్తులు వివేక్ దృష్టికి తీసుకొచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. బాధలు, కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. అందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉదయం 8 గంటలకు మొదలైన ప్రచారం రాత్రి వరకు కొనసాగింది.
ఏజెన్సీ యాక్ట్ను తొలగిస్తం..
మందమర్రిలో ఉన్న 1/17 ఏజెన్సీ యాక్ట్ను తొలగిస్తామని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. బాల్క సుమన్ పీఏలు ప్రభుత్వ ఉద్యో గస్తులని, కానీ వారు పార్టీ ఏజెంట్లుగా మారి ప్రజలకు, కార్యకర్తలకు దమ్కీ ఇస్తున్నారని మండిపడ్డారు. రోడ్డు బాగాలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని టార్గెట్ చేసి వేధిస్తున్న బాల్క సుమన్కు బుద్ధి చెప్పాలన్నారు. సుమన్కు ఎవరూ భయపడొద్దని, ఆయన బాధితులకు తాను అండగా ఉంటానని వివేక్ హామీ ఇచ్చారు.