
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని మాట ఇచ్చిన కేసీఆర్.. కల్వకుంట్ల తెలంగాణగా మార్చిండని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన కేసీఆర్ పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు రాకున్నా వస్తున్నాయని ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేసిందని వివేక్ విమర్శించారు. ధరణి పోర్టల్ రాష్ట్రంలోనే పెద్ద కుంభకోణమన్న ఆయన.. అది వచ్చాకే భూ సమస్యలు ఎక్కువయ్యాయని అన్నారు.
కాళేశ్వరాన్ని కమీషన్ల ప్రాజెక్టుగా మార్చిన కేసీఆర్ రూ.70 వేల కోట్ల దోచుకున్నాడని వివేక్ విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి అందరినీ ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే గొప్ప ప్రధాని అని సర్వేలు చెప్పుతున్నాయన్న వివేక్.. ఆయన పాలనలో దేశం అభివృద్ది చెందుతోందని అన్నారు. బీజేపీకి కార్యకర్తలే బలమని.. వారు కష్టపడి పనిచేయడం వలనే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ లో పార్టీ గెలిచిందన్నారు.