బీజేపీ చేవేళ్ల సభకు కొనసాగుతున్న భారీ ఏర్పాట్లు.. జనసమీకరణపై స్పెసల్ ఫోకస్ 

బీజేపీ చేవేళ్ల సభకు కొనసాగుతున్న భారీ ఏర్పాట్లు.. జనసమీకరణపై స్పెసల్ ఫోకస్ 

తెలంగాణ బీజేపీ ఏప్రిల్ 23న చేవేళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకులు.. జనసమీకరణపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్న ఈ సభను సక్సెస్ చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే చేవేళ్లలో ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. దగ్గరుండి పార్టీ నేతలు సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. 

చేవేళ్లకు వెళ్లే దాదాపు అన్ని రహదారుల గుండా బీజేపీ నాయకులు తమ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ చూసినా బీజేపీ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. సభను సక్సెస్ చేసి, కార్యకర్తల్లో జోష్ నింపాలని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

సభను సక్సెస్ చేసేందుకు...

పార్లమెంటరీ ప్రవాస్  యోజన ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న మొదటి బహిరంగ సభ ఇదే కావడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. మూడు రోజులుగా  సభ ఏర్పాట్లలో రాష్ట్ర నేతలు మునిగారు. ఏప్రిల్ 20 బండి సంజయ్ ఏర్పాట్లను పరిశీలించి, జన సమీకరణపై పార్టీ నేతలతో చర్చించారు. కనీసం లక్ష మందిని సభకు తరలించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు శ్రమిస్తున్నారు. హైదరాబాద్ సిటీకి వేదిక దగ్గరగా ఉండడం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరుగనుండడంతో పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడంపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు.

అమిత్ షా షెడ్యూల్ ఇదే..

* ఏప్రిల్ 23న  ఆదివారం అమిత్ షా సుమారు నాలుగున్నర గంటల పాటు హైదరాబాద్ లో గడపనున్నారు. 

* మధ్యాహ్నం 3. 30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7. 50 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. 

* షెడ్యూల్ ప్రకారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ హోటల్​కు చేరుకుంటారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ట్రిపుల్ ఆర్ మూవీ టీంతో 4  నుంచి 4. 30 గంటల వరకు సమావేశం అవుతారు. 

* సాయంత్రం 4. 30 నుంచి 5.10 వరకు అక్కడే బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. 

* 6 గంటలకు చేవెళ్ల సభకు చేరుకొని 7 గంటల వరకు అక్కడే ఉంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 7. 45 కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 7.50 గంటలకు ఢిల్లీ బయలుదేరుతారు.