
- జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్
- చేవెళ్ల విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలు
చేవెళ్ల, వెలుగు : మూడోసారి మోదీని ప్రధానిని చేయడమే బీజేపీ కార్యకర్తల లక్ష్యమని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం రాత్రి చేవెళ్ల మండల కేంద్రంలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కె లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే మూడోసారి మోదీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. మోదీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికీ తెలపాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు దొంగ పార్టీలేనని విమర్శించారు. 500 ఏళ్ల హిందువుల కల అయిన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రధాని మోదీతోనే సాధ్యమైందన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చేవెళ్లలో అభ్యర్థి దొరకడం లేదని ఎద్దేవా చేశారు. కామారెడ్డి మాదిరిగా.. చేవెళ్లకు ఇన్చార్జిగా సీఎం రేవంత్రెడ్డి ఉన్నారని ఆయనకు పరాభావం తప్పదన్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతం జాతీయవాదమని పేర్కొన్నారు.
చేవెళ్లలో భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంత రెడ్డి నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, మాణిక్య రెడ్డి తదితరులు ఉన్నారు.