
- కేబినెట్లో ప్రజా సమస్యలపై చర్చించనేలేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. సుదీర్ఘంగా సాగిన కేబినెట్ మీటింగ్లో ఉద్యోగుల సమస్యలు తప్ప.. ప్రజా సమస్యలపై చర్చించకపోవడం శోచనీయమన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదని, ఇది హామీల ఎగవేతల సర్కార్ అని మరోసారి నిరూపితమైందన్నారు. మంత్రులు రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి సొంత లాభాలు చూసుకుంటున్నారని, కమీషన్లు వచ్చే అంశాలపైనే చర్చిస్తున్నారని మండిపడ్డారు.
రైతు భరోసా స్కీమ్ కింద యాసంగిలో మొత్తం 152 లక్షల ఎకరాలకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.9,120 కోట్లు రైతులకు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.5,100 కోట్లు మాత్రమే జమ చేసిందన్నారు. నిరుద్యోగులకు, మహిళలకు రూ.63 వేల కోట్లు ఈ ప్రభుత్వం బకాయి పడిందని తెలిపారు. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలలో వెంటనే మూడు డీఏలు విడుదల చేయాలని, మిగతా రెండింటిని పీఆర్సీలో కలిపి ఇవ్వాలన్న ఉద్యోగ జేఏసీ డిమాండ్లను పట్టించుకోకుండా రాష్ట్ర సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు.