- సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఫైర్
- కేసీఆర్ మాటలు పొద్దుతిరుగుడు లెక్కుంటయ్
ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వెలుగు: సీఎం కేసీఆర్కు దళితుల పేరు పలకడం కూడా ఇష్టముండదని, ఇక రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అంటే అసలే గిట్టదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు మండిపడ్డారు. అందుకే అంబేద్కర్ పేరిట స్టార్ట్ చేసిన తుమ్మిడిహట్టి – ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ ప్రాణం తీసి, కాళేశ్వరం పేరిట తన క్రెడిట్ కోసం కాసుల వర్షం కురిపించుకునేలా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కాగజ్నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ నేత పాల్వాయి హరీశ్బాబు చేపట్టిన ప్రాణహిత జలసాధన పాదయాత్ర ప్రారంభోత్సవంలో రఘునందన్రావుపాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
ప్రాజెక్టు తరలింపునకు ముందే ప్లాన్
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తరలింపును కేసీఆర్ ముందే ప్లాన్ చేసుకున్నాడని, ప్రాణహితను తరలిస్తే ఈ ప్రాంత ఎమ్మెల్యేలు కనీసం మాట్లాడలేదని రఘునందన్ ఆరోపించారు. చీటికీమాటికీ అతిగా స్పందించే చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్.. ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేగా అప్పటి సీఎం వైఎస్ వెంట ఉన్న కోనేరు కోనప్ప నోరు విప్పలేదన్నారు. కేసీఆర్ మాటలు పొద్దుతిరుగుడు పూల లెక్క ఉంటాయన్నారు. 2018 ఎన్నికల సమయంలో కాగజ్నగర్లో మీటింగ్ పెట్టినప్పుడు ప్రాణహిత ప్రాజెక్టు గురించి ఆందోళనపడొద్దని, 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, దీని కోసం మంచి ప్రాజెక్టు ఇక్కడే కడతానని చెప్పి ఇప్పటి వరకు ఆ మాట నెరవేర్చలేదన్నారు.
పోలీసు రాజ్యం నడుపుతున్నరు
హరీశ్రావు, కేటీఆర్ తెల్లారితే ఏదో ముచ్చట మాట్లాడుతుంటారని, దేశంలో ఎక్కడా లేని వడ్ల పంచాయితీ తెలంగాణలోనే ఎందుకు ఉందో తెలుసుకోవాలని రఘునందన్ సూచించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం నడుపుతున్నారని, తెలంగాణ రాకముందు నిర్బంధం కంటే ఇప్పుడు రాష్ట్రంలో పోలీస్ యాక్ట్ పెట్టి సభలు, ర్యాలీలు జరగకుండా అణగదొక్కుతున్నారని ఆరోపించారు. కుమ్రంభీం, శివాజీ పోరాట స్ఫూర్తితో ప్రాణహిత ప్రాజెక్టు సాధన సహా అన్ని విషయాలపైనా బీజేపీ పోరాడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రాణహిత కట్టితీరుతమన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతిపరులు: ప్రేమేందర్రెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి ఊబిలో కూరుకుపోయారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి ఆరోపించారు. పాల్వాయి హరీశ్బాబు చేపట్టిన పాదయాత్రను ఈస్గాంలో జెండా ఊపి ఆయన ప్రారంభించారు. సీఎం కేసీఆర్అధికారం చేపట్టిన తర్వాత ప్రాణహిత ప్రాజెక్టునే నామరూపాలు లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రాణహిత పుష్కరాలకు రూ.50 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టకపోతే తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.