కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే: లక్ష్మణ్

కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే: లక్ష్మణ్

మునుగోడు: టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తరఫున మునుగోడులో ఎంపీ లక్ష్మణ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ తోడు దొంగలని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధ్యక్షుడు ఎవరు ఉండాలో కేసీఆరే నిర్ణయిస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే... టీఆర్ఎస్ కు వేసినట్లేనని స్పష్టం చేశారు. కేసీఆర్ కేబినేట్లో ఆయన కొడుకు, కూతురు, అల్లుడికి మాత్రమే సామాజిక న్యాయం జరిగిందని ఎద్దేవా చేశారు.

ఓ వైపు పీఎం మోడీ సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం తన కుటుంబం కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. వివిధ పథకాల పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, అయితే ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడులో గెలిచేది  బీజేపీ మాత్రమేనని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.