సంక్షేమ నినాదమే బీజేపీని గెలిపించింది : జేపీ నడ్డా

సంక్షేమ నినాదమే బీజేపీని గెలిపించింది : జేపీ నడ్డా

ప్రధాని మోడీ సమర్ధ నాయకత్వం, సంక్షేమ నినాదమే గుజరాత్ లో బీజేపీకి చారిత్రక విజయాన్ని అందించాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదాన్ని ప్రజలు సానుకూలంగా స్వీకరించారని తెలిపారు. గుజరాత్ లో బీజేపీ విజయాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ‘‘ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం ప్రధాని మోడీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అవి ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. 

అందుకే బీజేపీని ఎన్నికల్లో ఆశీర్వదించారు.  బీజేపీ సర్కారు వల్ల జరుగుతున్న వికాసాన్ని చూసి అత్యంత విశ్వాసంతో గుజరాత్ ప్రజలు బీజేపీకి రికార్డు విజయాన్ని కట్టబెట్టారు’’ అని నడ్డా చెప్పారు. ‘‘ గుజరాత్ లో పోటీ చేసిన ఒక పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ తనను తాను నిజాయితీ పరుడని చెప్పుకుంటాడు.. మెడలో నిజాయితీ బోర్డు వేసుకొని తిరుగుతాడు. అతడు ఈ ఎన్నికల ఫలితాలను చూసైనా సరే ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘హిమాచల్ లో అధికారంలోకి వచ్చే పార్టీకి స్వాగతం పలుకుతున్నం. ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారిని కోరుతున్నం’’ అని తెలిపారు.