హుషారైనవనే కదా! కేసీఆర్ నిన్ను పక్కన పెట్టింది

హుషారైనవనే కదా! కేసీఆర్ నిన్ను పక్కన పెట్టింది

ఆర్థికమంత్రి హరీశ్ రావు హుషార్ అయ్యాడనే.. సీఎం కేసీఆర్ ఆయనను పక్కనపెట్టాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మంత్రి హరీశ్ రావు అసెంబ్లీ సాక్షిగా తప్పుడు సమాచారాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాడని ఆమె ఆరోపించారు. మంత్రి హరీశ్ రావు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మంత్రి హరీష్ నీకు సిగ్గు, శరం, లజ్జ ఉందా? అని ఆమె హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ సందర్భంగా ఆమె పైవ్యాఖ్యలు చేశారు. 

‘రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసెంబ్లీలో అబద్ధాలు చెప్తావా? రాష్ట్రాన్ని నువ్వు, నీ మామ దోచుకుంటూ... రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతున్న బీజేపీపై విమర్శలు చేస్తావా? ఇంగీత జ్ఞానం ఉందా హరీశ్ నీకు? తెలంగాణ ప్రజలకు మీ బండారం మొత్తం అర్థం అవుతుంది. కేంద్రానికి బండి సంజయ్ రాసిన లేఖలో ఏముందో అసలు చదివినవా హరీశ్? తెలంగాణ రాష్ట్రంపై భక్తి నీకు ఉందా? మాకు ఉందా? ప్రాజెక్ట్‌ల పేరుతో వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకుంటుంటే ప్రశ్నించొద్దా? మీ దోపిడీతో మీరు జైలుకు వెళ్ళే రోజులు వచ్చాయి. బీజేపీ కేసీఆర్‌ను వదిలిపెట్టదు. మీరు చేసిన అవినీతి త్వరలోనే బయటకు తీస్తారు. ఏపీ ప్రభుత్వం సంగమేశ్వర ప్రాజెక్ట్‌ను అక్రమంగా నిర్మిస్తుంటే.. బండి సంజయ్ కేంద్రానికి లేఖ రాశారు. ప్రాజెక్ట్ ఆపాలని మీరు కేంద్రాన్ని కోరలేదు కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం బండి సంజయ్ కేంద్ర జల శక్తికి లేఖ రాశాడు. ఇది తప్పా....? తెలంగాణా ప్రజల ఆకాంక్షలను, అమరుల త్యాగాలను సీఎం కేసీఆర్ జగన్ కాళ్ల వద్ద పెట్టారు. సంగమేశ్వర ప్రాజెక్ట్‌ను కేసీఆర్ ఎందుకు ఆపడం లేదు? నువ్వు హుషార్ అయినవనే  కదా! మీ మామ కేసీఆర్ నిన్ను పక్కన పెట్టింది. మంత్రి పదవి నీకు ఎందుకు ఇవ్వలేదో అందరికి తెలియదా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేంద్రానికి డీపీఆర్ ఇస్తామని కేసీఆర్ చెప్పలేదా? తప్పు లేనప్పుడు ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లను ఎందుకు ఇస్తలేరు? తప్పు చేయకుంటే డీపీఆర్‌లు కేంద్రానికి ఇవ్వాలి. మీ అవినీతి బయటపడుతుందనే డీపీఆర్‌లను బయట పెట్టడం లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల డీపీఆర్‌లను బయటపెట్టిననాడు మీ ముఖాలా మీద పేడతో కొట్టే రోజులు వస్తయి’ అని ఆమె హెచ్చరించారు.