- రుణ మాఫీ అమలు ఏమైంది?.. పింఛన్లు ఎటుపోయినయ్?
- ప్రాజెక్టుల కమీషన్లతో కేసీఆర్ సొంత ఆస్తులు పెంచుకున్నారని ఫైర్
- జుక్కల్ నియోజవర్గంలో కొనసాగిన ‘ప్రజా గోస..బీజేపీ భరోసా’ యాత్ర
కామారెడ్డి/ నిజాంసాగర్, వెలుగు: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ‘‘ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెంచి, అలా వచ్చిన కమీషన్ల సొమ్ముతో సీఎం కేసీఆర్ సొంత ఆస్తులు పెంచుకున్నడు. కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ఫామ్హౌస్లు నిర్మించుకుంటున్నరు. ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదు” అని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలను పట్టించుకోని కేసీఆర్ను గద్దె దించాలన్నారు. ‘ప్రజా గోస..- బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా రెండో రోజు శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని నిజాంసాగర్ మండలంలో బీజేపీ నేతల పర్యటన కొనసాగింది. కొమలంచ, దుఫ్సింగ్ తండా, గాలిపూర్, మగ్ధుంపూర్, మహ్మద్నగర్, ఒడ్డెపల్లి, జక్కాపూర్ , మల్లూర్లో వివేక్ వెంకటస్వామి తదితరులు స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం రాష్ట్ర అప్పును కేసీఆర్ రూ. 5లక్షల కోట్లకు తీసుకెళ్లిండు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం పెంచిన వ్యయంతో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరిగేది” అని అన్నారు. ‘‘క్రాప్ లోన్లు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు.. ఫించన్లు ఇవ్వడం లేదు. కేసీఆర్ గ్రాప్ ఎన్నికల టైంలో 45 శాతం ఉండగా ఇప్పుడు 29 శాతానికి పడిపోయింది. ప్రజలు కేసీఆర్పై, ఆయన పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు” అని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని కూడా కేసీఆర్ పంపిణీ చేయలేదన్నారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే గ్రామాల్లోకి రావడం లేదని, ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం లేదన్నారు. యాత్రలో నేతలు కాటిపల్లి వెంకటరమణరెడ్డి, చిన్న రాజులు, సాయిలు, దత్తేశ్వరి, చైతన్యగౌడ్, రాము , భరత్, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహ్మద్నగర్లో జరిగిన కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి కూడా పాల్గొన్నారు.