తెలంగాణ బీజేపీ అడ్డా అని చాటి చెబుదాం: బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అడ్డా అని చాటి చెబుదాం: బండి సంజయ్

లక్షలాది మందిని సమీకరించి కరీంనగర్ లో ఈనెల 15న జరిగే బహిరంగ సభను విజయవంతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు.  ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతారని వెల్లడించారు. ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణ బీజేపీకి అడ్డా అని నిరూపిస్తామని తెలిపారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేననే సంకేతాలను ప్రజల్లోకి పంపుతామని చెప్పారు.  ఇవాళ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని వేంపేట సమీపంలో ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద జిల్లా ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. 

పార్టీ సంస్థాగత బలోపేతం, పోలింగ్ బూత్ ల ఏర్పాటుతోపాటు ఈనెల 15న కరీంనగర్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీరణ, సభ సక్సెస్ కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై ఈసందర్భంగా చర్చించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారనే సంకేతాలొస్తున్నాయని సంజయ్ అన్నారు. ఈ క్రమంలో 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభ కరీంనగర్ జిల్లాలో జరగబోతోందని తెలిపారు. ఈ 5 రోజులు పూర్తిగా సభ సక్సెస్ పైనే దృష్టి పెట్టాలన్నారు. ప్రతిచోట సభ గురించే చర్చ జరిగేలా ప్రచారం చేయండని పార్టీ శ్రేణులకు నిర్దేశించారు.