
- ఉత్తర తెలంగాణలో నాలుగు చోట్ల కమల వికాసం
- దక్షిణాదిన నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభంజనం
- పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్, పాలమూరుల్లో మాత్రం భిన్న ఫలితాలు
హైదరాబాద్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణపై బీజేపీ, దక్షిణ తెలంగాణపై కాంగ్రెస్ పట్టు నిలుపుకున్నాయి. నార్త్ తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సిట్టింగ్ సీట్లను బీజేపీ తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న మెదక్లోనూ పాగా వేసింది. ఇక సౌత్ తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, నాగర్కర్నూల్ సీట్లను భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభంజనానికి పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్లో సురేష్ షెట్కార్ చెక్ పెట్టగా, దక్షిణ తెలంగాణలో మహబూబ్నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి అరుణ గెలుపొందడం విశేషం.
ఉత్తర తెలంగాణలో బీజేపీ జోష్..
ఉత్తర తెలంగాణలో బీజేపీ దూకుడు కొనసాగింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ సిట్టింగ్ సీట్లను దక్కించుకున్నారు. ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావుకు బదులు బీఆర్ఎస్ నుంచి వచ్చిన గెడం నగేశ్కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ విషయంలో హైకమాండ్ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపట్టినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం మళ్లీ బీజేపీకే పట్టంగట్టారు.
ఇక బీఆర్ఎస్కు కంచుకోట, సిట్టింగ్ సీటైన మెదక్ను త్రిముఖ పోరులో కమలం పార్టీ గెలుచుకోగలిగింది. ఇక్కడ హోరాహోరీ పోరులో కాంగ్రెస్పై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చిరస్మరణీయ విజయం సాధించారు. అప్పట్లో దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు గెలవడంతో రాష్ట్రంలో బీజేపీకి మంచి ఊపు వచ్చింది. కానీ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలైనప్పటికీ తాజాగా మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ బీఆర్ఎస్ను చావుదెబ్బ తీశారు. బీజేపీ ఊపులోనూ పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్ స్థానాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మూడూ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు కావడం విశేషం.
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు..
దక్షిణ తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయాలు నమోదు చేసింది. ఈ ప్రాంతంలో కేవలం ఒక్క మహబూబ్ నగర్ సీటును మాత్రమే బీజేపీ గెలుచుకుంది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇక్కడ విజయం సాధించారు. పాలమూరు నుంచి బీజేపీ తరపున గతంలో సీనియర్ నేత జితేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు.
అరుణ విజయంతో సౌత్ తెలంగాణలో బీజేపీ రానున్న రోజుల్లో బలపడే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. నార్త్ నుంచి నాలుగు సీట్లను సాధించిన బీజేపీ, సికింద్రాబాద్తో పాటు సిటీ శివారులోని మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిట్టింగ్ సీటును కాపాడుకోగా, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించడంతో బీజేపీ బలం మరింత పెరిగింది.