ప్రభుత్వ ఉద్యోగుల భుజాల మీద తుపాకీ పెట్టి .. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను కాల్చుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులు.. ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ మద్దతు ఇస్తారన్న భయంతోనే అప్పటికప్పుడు పీఆర్సీని సీఎం తెరమీదకు తెచ్చారన్నారు.
జీతాలు లేక ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లక్ష్మణ్ అన్నారు. సమ్మె విరమించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. “రాష్ట్రంలో రైతు బంధు, రుణమాఫీ పథకాలు బంద్ అయ్యాయి. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు. సీఎం నియంతృత్వ పోకడలకు ప్రజలు విసుగు చెందారు. తెలంగాణ సమాజం బీజేపీ వైపు ఆశగా చూస్తోంది. మోదీ పాలనలో చారిత్రాత్మక నిర్ణయాలకు నాయకులు ప్రభావితం అవుతున్నారని” లక్ష్మణ్ అన్నారు.
పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన కొందరు తెలుగుదేశం నాయకులు.. గురువారం లక్ష్మణ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.