- బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితను గెలిపించాలి
- కంటోన్మెంట్ సెగ్మెంట్లో జరిగిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్
కంటోన్మెంట్, వెలుగు: కంటోన్మెంట్ అభివృద్ధి బాటలో మరింత ముందుకు సాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు. మంగళవారం రాత్రి కంటోన్మెంట్ సెగ్మెంట్ పరిధి అన్నా నగర్, పికెట్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ పరిధిలోని భూమికి బదులు మరోచోట ఇస్తామంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒప్పుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రం సహకరించకున్నా కంటోన్మెంట్ వాసులకు ఫ్రీ వాటర్ స్కీమ్ను అందిస్తున్నామని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు.
దివంగత ఎమ్మెల్యే సాయన్న వివాదరహితుడని.. ఆయన కుమార్తె లాస్య నందితపై బీజేపీ నేతలు బురదజల్లుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుమాలిన వీడియోలతో దుష్ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కంటోన్మెంట్ ప్రజల బాగోగులు పట్టని బీజేపీకి డిపాజిట్ దక్కకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. రోడ్ షోలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అభ్యర్థి లాస్య నందిత, సీనియర్ నేత ఎంఎన్ శ్రీనివాస్, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ మెంబర్ జక్కుల మహేశ్వర్ రెడ్డి, అనితా ప్రభాకర్ ఉన్నారు.