హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ లంకను బీజేపీ వానర సేన దహనం చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్చుగ్ అన్నారు. కేసీఆర్ అహంకారం నవంబర్తో పోతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ అనుబంధ మోర్చాల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా.. పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్లు సునీల్ బన్సల్, తరుణ్చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఏడు మోర్చాల రాష్ట్రఅధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ‘‘అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ ప్రజలు ముక్తి కోరుకుంటున్నారు. బీఆర్ఎస్కు బీ టీమ్ గా కాంగ్రెస్ పని చేస్తున్నది. 2018లో కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచిన వారు ఇప్పుడు ఎక్కడున్నారు?” అని ప్రశ్నించారు. కేసీఆర్ అభ్యర్థులను ఓడించేందుకు ఈ మూడు నెలలు కష్టపడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కేసీఆరే కొరివి పెట్టుకుంటుండు: సంజయ్
అవినీతి ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చిన కేసీఆర్కు ఇక మూడినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హెచ్చరించారు. బీఆర్ఎస్కు కేసీఆర్ కొరివి పెట్టుకుంటున్నాడన్నారు. ఆ పార్టీని ఎదిరించే దమ్ము బీజేపీకే ఉందన్నారు. దళిత బంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30% కమీషన్లు దండుకుంటున్నారని కేసీఆరే చెప్పారని, అలాంటి వారికీ టిక్కెట్లు ఇచ్చారంటే ఆలోచించాలని తెలంగాణ ప్రజలను కోరారు. ‘‘గజ్వేల్లో ఓడిపోతాననే భయంతో కేసీఆర్ కామారెడ్డిలో కూడా పోటీ చేస్తాడట. అసలు కామారెడ్డిలో కేసీఆర్ గెలుస్తడా? ఎంఐఎం సహకారంతో గెలవాలనుకుంటున్నడు. కామారెడ్డి, గజ్వేల్ లో రెండు చోట్ల కేసీఆర్ ఓడిపోవడం ఖాయం. బీఆర్ఎస్ ఓటమి తథ్యం. తెలంగాణలో ఆ పార్టీ ఖేల్ ఖతమైనట్లే” అని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎగిరెగిరి పడుతున్నదని, గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లే రాలేదని ఎద్దేవా చేశారు.
జనంలోకి వెళ్లండి: సునీల్ బన్సల్
రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో మోర్చాలది కీలక పాత్ర అని, ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లాలని బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్చార్జ్ సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. కేంద్రంలో మోదీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని, అదే సమయంలో కేసీఆర్ సర్కార్ అవినీతిని ఎండగట్టాలని చెప్పారు. ఏ మోర్చాకు సంబంధించిన వారు ఆయా వర్గాలను బీజేపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలన్నారు. ఈ 3 నెలలు చాలా కీలకమని, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
యుద్ధభేరి మోగించాలి: ఎంపీ లక్ష్మణ్
ప్రజల తరఫున బీజేపీ అనుబంధ మోర్చాలు యుద్ధభేరి మోగించాలని ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అపర కుబేరులుగా మారిపోయారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారన్నారు. రైతుబంధు పేరుతో రైతులకు మిగతా పథకాలు బంద్ చేస్తున్నారని విమర్శించారు. మూడు ఎకరాల భూమి పేరుతో దళితులను దగా చేశారని, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నదులకు నడక నేర్పడం దేవుడెరుగు అని, లిక్కర్ స్కామ్తో ఢిల్లీ వరకు పరుగులు పెట్టించారని ధ్వజమెత్తారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పార్టీ క్యాడర్ కు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఉద్యమం ద్వారానే నయా నిజాం మెడలు వంచుదామన్నారు.a