కరీంనగర్‌‌లో 45 స్థానాలు గెలుస్తం..కాంగ్రెస్, ఎంఐఎం మధ్య లోపాయికారి ఒప్పందం 

కరీంనగర్‌‌లో 45 స్థానాలు గెలుస్తం..కాంగ్రెస్, ఎంఐఎం మధ్య లోపాయికారి ఒప్పందం 
  • మేయర్‌‌ పీఠం అప్పగిస్తే ప్రజల రక్షణ కవచం అవుతా
  • కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్, వెలుగు : ‘కరీంనగర్‌‌ కార్పొరేషన్‌‌ ఎన్నికల్లో వార్‌‌వన్‌‌సైడ్‌‌గా మారింది, మొత్తం 66 డివిజన్లలో 45 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది’ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌‌కుమార్‌‌ ధీమా వ్యక్తం చేశారు.

మేయర్‌‌ పీఠం బీజేపీకి అప్పగిస్తే కరీంనగర్ ప్రజలకు రక్షణ కవచంగా మారి భూకబ్జాదారులు, డ్రగ్స్‌‌ అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మున్సిపల్‌‌ ఎన్నికల ప్రచారంలో భాగంగాలో సోమవారం కరీంనగర్‌‌లోని తీగలగుట్టపల్లి, చింతకుంటలో నిర్వహించిన స్ట్రీట్‌‌ కార్నర్‌‌ మీటింగ్‌‌లో మాట్లాడారు. ఆర్‌‌వోబీ కోసం నాలుగేండ్ల కింద రూ. 110 కోట్లు మంజూరు చేయించానని, బీఆర్ఎస్‌‌ ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందన్నారు. దీంతో సేతుబంధు పథకం కింద కేంద్రం నుంచే రూ.154 కోట్లు రిలీజ్‌‌ చేయించినట్లు గుర్తు చేశారు. ఆ నిధులను పనులు జరుగుతున్నాయన్నారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన భూసేకరణను కావాలనే ఆలస్యం చేస్తూ బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌‌.. కుట్రలు, పైసలు పార్టీ అయితే.. బీఆర్‌‌ఎస్‌‌ భూ దందాలు, బద్నాం పార్టీ అని, ఎంఐఎం మోసాలు, మాయలు, మతోన్మాద పార్టీ అని విమర్శించారు. ప్రజలకు అండగా ఉండి అభివృద్ధి చేసేది బీజేపీ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరారు.