రోజంతా దీక్షలోనే సంజయ్....

రోజంతా దీక్షలోనే సంజయ్....

సంఘీభావం ప్రకటించిన నేతలు 

కరీంనగర్, వెలుగు: బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్న రాష్ట్ర సర్కారు తీరుకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్​లోని ఆయన స్వగృహంలో రోజంతా నిరసన దీక్ష చేశారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ మండలం పామునూరులో బండి సంజయ్​ను మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్​లోని ఆయన ఇంట్లో హౌస్​అరెస్ట్​చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం గృహనిర్బంధం ముగియడంతో సంజయ్ అక్కరే నిరసన దీక్ష చేపట్టారు. అంతకు ముందు జ్యోతినగర్ లోని మహాశక్తి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. రూలింగ్​పార్టీ ఎన్ని దాడులు చేసినా... రాళ్లు, రాడ్లు విసిరినా ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తే లేదని సంజయ్ స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబ పాలనను బొంద పెట్టే వరకు పాదయాత్ర కొనసాగించి తీరుతామన్నారు. కాగా దీక్ష చేస్తున్న సంజయ్​కు సంఘీభావంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్​ వెంకటస్వామి, సీనియర్ నేత దాసోజు శ్రవణ్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, జిల్లా అధ్యక్షుడు గంగిడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు జె.సంగప్ప, రాణి రుద్రమదేవి, దరువు ఎల్లన్న వచ్చి దీక్షలో కూర్చున్నారు. 

జిల్లావ్యాప్తంగా మద్దతు దీక్షలు..

పెద్దపల్లి, వెలుగు: అరెస్టులతో బీజేపీని అడ్డుకోవాలని చూస్తే సహించమని పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల బీజేపీ లీడర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్న టీఆర్ఎస్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూలపల్లి మండలం కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ లీడర్లు ప్రదీప్​కుమార్​, స్వామి, సంతోష్ రెడ్డి, ఐలయ్య, రాజయ్య, రాజిరెడ్డి, కనకయ్య, చంద్రయ్య, లక్ష్మణ్, అజయ్, ఎల్లేశం, ఆశిష్, నాగరాజు పాల్గొన్నారు.. 

సిరిసిల్ల కలెక్టరేట్: ప్రభుత్వ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి అన్నారు. బండి సంజయ్​అరెస్ట్ కు నిరసనగా బుధవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సమస్యల కోసం బండి సంజయ్​ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తుంటే ప్రజల నుంచి వచ్చే ఆదరణ చూసి టీఆర్ఎస్ ఓర్వలేక పోతోందన్నారు. కార్యక్రమంలో లీడర్లు రాజు, రవీందర్, కైలాస్, రాజాసింగ్, భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.  

వీర్నపల్లి: బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో వీర్నపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం దీక్ష చేపట్టారు. బీజేపీ మండలాధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, మండల ఓబీసీ అధ్యక్షుడు తిరుపతి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు ప్రకాశ్ పాల్గొన్నారు. 

కోరుట్ల: బండి సంజయ్​అరెస్ట్​ను నిరసిస్తూ బుధవారం కోరుట్ల లో బీజేపీ పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా పలువురు లీడర్లు మాట్లాడారు. సీఎం కేసీఆర్​ఫ్యామిలీ, మంత్రులు చేస్తున్న అక్రమాలను బయటపెట్టి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మహేశ్, విజయ్, సుదర్శన్, సెక్రటరీ మోలుమూరి రాజ్ మురళి, కౌన్సిలర్​ నరేశ్, సర్పంచ్ తుకారాం  పాల్గొన్నారు. 

మంథని: బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ లీడర్​చందుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో మంథని బీజేపీ ఆఫీస్​లో మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఓటమి భయంతోనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారని అన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు సదాశివ్, పట్టణ కార్యదర్శి సంతోష్, తిరుపతి, నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

కోనరావుపేట: బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బుధవారం కోనరావుపేట బీజేపీ ఆఫీస్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓబీసీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రశ్నించే వారిని అరెస్ట్ చేస్తూ ప్రభుత్వం నియంత పాలన సాగిస్తోందన్నారు. బీజేపి లీడర్లపై కేసులు పెడితే ఊరుకోమన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు మోహన్, వెంకటి, దిలీప్, యువజన నాయకుడు జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.