ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్‌

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్‌

నల్గొండ, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతో జోష్‌ మీదున్న బీజేపీ నాయకత్వం జిల్లాలో ‘ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ కమలం’ షురూ చేసింది. మునుగోడులో పది వేల ఓట్ల మెజార్టీతోనే టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ గెలవడం, బీజేపీకి 86 వేలకు పైచిలుకు ఓట్లు రావడంతో రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీనే కోరుకుంటున్నట్లు స్పష్టమైందని ఆ పార్టీ హైకమాండ్‌‌‌‌‌‌‌‌ నమ్ముతోంది. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే స్పీడ్‌‌‌‌‌‌‌‌ను కొనసాగించి పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇటీవల నియోజకవర్గ కన్వీనర్లు, జిల్లా కోర్‌‌‌‌‌‌‌‌ కమిటీని స్టేట్‌‌‌‌‌‌‌‌ పార్టీ ప్రకటించింది. ఈ కమిటీలో సీనియర్లకు తోడు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డికి కూడా చోటు కల్పించడంతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ కనిపిస్తోంది. దీంతో పాటు రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్థాయి కలిగిన లీడర్లు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అసంతృప్తులు, ఆశావాహులు, బలమైన నేతలపైన బీజేపీ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టింది.

అధికార పార్టీ అసంతృప్తులను ఆకర్షించేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌‌‌‌‌‌‌‌లకే టికెట్లు ఇస్తామని  సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేయడం అధికార పార్టీలోని ఆశావాహుల్లో ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగతుందన్న సంకేతాలు కూడా ఇవ్వడం ఆ పార్టీ నేతలను మరింత ఇరకాటంలో పడేసింది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వైఖరిపైన అసంతృప్తి కలిగిన సెకండ్‌‌‌‌‌‌‌‌ కేడర్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే పక్క పార్టీలవైపు తొంగి చూస్తున్నారు. మునుగోడులో సెకండ్‌‌‌‌‌‌‌‌ కేడర్‌‌‌‌‌‌‌‌ అసంతృప్తి వల్లే పార్టీకి తీరని నష్టం జరిగిందన్న సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీలో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తులను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొం దించింది. 

జనాకర్షణ కలిగిన నేతలకే ఆదరణ

జనాకర్షణ కలిగిన నేతలనే ప్రజలు ఆదరిస్తున్నట్లు మునుగోడు ఎన్నికల రిజల్ట్‌‌‌‌‌‌‌‌తో రుజువైంది. రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉందనుకుంటున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ మునుగోడులో మూడో స్థానానికి పడిపోయింది. ఇదే రకమైన ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్‌‌‌‌‌‌‌‌ అవుతాయనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో వ్యక్తం అవుతోంది. అయితే బీజేపీ సంస్థాగతంగా బలంగా లేకపోవడం, అన్ని చోట్ల జనాకర్షణ కలిగిన లీడర్లు లేకపోవడం ఆ పార్టీకి ప్రధాన సమస్యగా మారింది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి లీడర్లు, కేడర్‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పటికీ ఎన్నికల ఖర్చు గురించి భయపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో గ్రూప్‌‌‌‌‌‌‌‌ తగాదాలు ఇప్పటికే తారస్థాయికి చేరాయి. నల్గొండ, నాగార్జునసాగర్, కోదాడ, నకిరేకల్, భువనగిరి, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వైఖరి పట్ల సెకండ్‌‌‌‌‌‌‌‌ కేడర్‌‌‌‌‌‌‌‌ తీవ్ర అసంతృప్తితో ఉంది. 

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా...

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. ఎమ్మెల్యే టికెట్‌‌‌‌‌‌‌‌పైన ఆశలు పెట్టుకున్న, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే సీటు దక్కకుండా పోతుందనుకునే సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలపైన దృష్టి పెట్టింది. జనబలం ఉన్నప్పటికీ చివరి నిమిషంలో టికెట్‌‌‌‌‌‌‌‌ మిస్‌‌‌‌‌‌‌‌ అయితే ప్రత్యామ్నయంగా బీజేపీవైపే వస్తరని నమ్ముతోంది. ఇందులో భాగంగానే అలాంటి లీడర్లతో సంప్రదింపులు జరిపే బాధ్యతను పార్టీ హైకమాండ్‌‌‌‌‌‌‌‌ సీనియర్లకు అప్పగించినట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి కోదాడ, సూర్యాపేటలో పర్యటించినప్పుడు కూడా పార్టీ నేతల మధ్య ఇదే రకమైన చర్చ జరిగినట్లు తెలిసింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తేనే వచ్చే ఎన్నికల్లో గెలవడం సాధ్యం అవుతుందని, లేదంటే మునుగోడు తరహాలోనే చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తదని బీజేపీ సీనియర్‌‌‌‌‌‌‌‌ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.