
- రాజ్యసభకు లక్ష్మణ్ నామినేషన్
- సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవం
- రాజ్యసభ టికెట్ ఖరారుపై కె.లక్ష్మణ్
- లక్నోలో యూపీ సీఎం యోగి సమక్షంలో నామినేషన్
హైదరాబాద్, వెలుగు: సామాన్య కార్యకర్తకు బీజేపీలో గుర్తింపు ఉంటుందనడానికి.. తనకు రాజ్యసభ టికెట్ఇవ్వడమే నిదర్శనమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర భారతానికి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం తనకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. యూపీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిన తర్వాత లక్ష్మణ్మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని చెప్పారు. అన్ని కోణాల్లో సమీకరణలు జరిగిన తర్వాతే నా ఎంపిక జరిగిందని చెప్పారు. హైదరాబాద్ నుంచి మంగళవారం పొద్దునే లక్నో బయలుదేరి వెళ్లిన లక్ష్మణ్.. అక్కడ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు యూపీ బీజేపీ నేతల సమక్షంలో రాజ్యసభ అభ్యర్థిగా తన నామినేషన్ ను దాఖలు చేశారు.
బెంగళూరులో నిర్మల నామినేషన్
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల బరిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరు నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు ఆమె మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. విధాన సౌధ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మంత్రితో పాటు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యొడియూరప్ప సహా పలువురు నేతలు ఉన్నారు. అంతకుముందు గవి గంగాధరేశ్వర ఆలయంలో నిర్మల పూజలు చేశారు.