- ప్రభుత్వ సహకారంతో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తాం
- రాష్ట్రంలో వాలీబాల్ ఆటగాళ్లను తీర్చిదిద్దుతాం
- ప్రైమ్ వాలీబాల్ లీగ్కు అద్భుత ఆదరణ
- హైదరాబాద్ బ్లాక్హాక్స్ టీమ్ ఓనర్ అభిషేక్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వాలీబాల్ ఆటను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) టీమ్ హైదరాబాద్ బ్లాక్హాక్స్ ఓనర్ మెంబర్ కంకణాల అభిషేక్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే హైదరాబాద్లో బ్లాక్హాక్స్ తరఫున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడిన అకాడమీ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులను తీర్చిదిద్దుతామని చెప్పారు.
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో వాలీబాల్కు ఎంతో ఆదరణ ఉన్నప్పటికీ సరైన సౌకర్యాలు, గైడెన్స్ లేకపోవడం వల్ల యువత ఈ ఆటను కెరీర్గా ఎంచుకోలేకపోతున్నారని చెప్పారు. దీన్ని మార్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ‘పీవీఎల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క ప్లేయర్ లేకపోవడం నాకు కూడా అసంతృప్తిగా అనిపిస్తోంది. మా టీమ్లోకి ఒక్కరిని అయినా తీసుకోవడానికి చాలా ప్రయత్నించాం. పలు సెంటర్లలో ట్రయల్స్ నిర్వహించాం. కానీ ఈ లెవెల్లో ఆడే స్కిల్స్ ఉన్న వాళ్లు లభించలేదు. అందుకే మేం లీగ్ నిర్వహణతో సరిపెట్టకుండా రాష్ట్రంలో వాలీబాల్ గేమ్ను డెవలప్ చేయాలని డిసైడయ్యాం.
ఇందుకోసం గవర్నమెంట్, కార్పొరేట్ సంస్థల సపోర్ట్ ఆశిస్తున్నాం. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లాంటి కొన్ని కార్పొరేట్లకు స్టేడియంలో ఆటను చూపెట్టాం. కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న కోర్టులు కార్పొరేట్ల పేర్ల మీద ఓపెన్ చేస్తాం. వాటిలో మా కోచ్లతో మ్యాచ్లు, ట్రయల్స్ నిర్వహించి టాలెంట్ను గుర్తిస్తాం. అక్కడి నుంచి హైదరాబాద్లో బ్లాక్హాక్స్ అకాడమీకి తీసుకొచ్చి ఇంటర్నేషనల్ కోచ్ల గైడెన్స్తో వాళ్లను ప్రొఫెషనల్ ప్లేయర్లుగా తీర్చిదిద్దుదామన్నది మా టార్గెట్’ అని అభిషేక్ రెడ్డి పేర్కొన్నారు.
గవర్నమెంట్ సపోర్ట్ సూపర్
ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాలుగో సీజన్ మొత్తం హైదరాబాద్లో జరిగేందుకు కృషి చేసిన అభిషేక్ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందన్నారు. ‘హైదరాబాద్లో పీవీఎల్ జరగడం ఇది మూడోసారి. తొలి ఎడిషన్ను ఇక్కడే నిర్వహించాం. సిటీలో ఇలాంటి మెగా లీగ్స్ నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన ఇండోర్ స్టేడియం ఉంది. యూసుఫ్గూడ స్టేడియాన్ని ప్రాక్టీస్కు ఉపయోగించుకోవచ్చు.
మంచి హోటల్స్, ఎయిర్పోర్ట్ వంటి సౌకర్యాలు అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయి. ఫ్యాన్స్ మద్దతు బాగుంది. గవర్నమెంట్కు కూడా స్పోర్ట్ ఈవెంట్లకు ఎంతో సపోర్టివ్గా ఉంది. మాకు ఏ సమస్య ఎదురైనా, ఏ అవసరం ఉన్నా అన్ని డిపార్ట్మెంట్స్ తక్షణమే స్పందించాయి. ఇలాంటి లీగ్స్ను సింగిల్ సిటీలో నిర్వహించేందుకు దేశంలో హైదరాబాద్ను మించిన చోటు మరోటి ఉండదు’ అని చెప్పారు.
ఒత్తిడి వల్లే ఓడినం
నాలుగు సీజన్లలోనే పీవీఎల్కు ప్రజాదరణ చాలా పెరిగిందని అభిషేక్ తెలిపారు. టీవీ వ్యూయర్షిప్ కూడా మూడింతలు అయిందన్నారు. ‘సిటీలో జరిగిన తొలి సీజన్లో ఆట చూడాలని చాలా మందిని ఆహ్వానించాం. ఈసారి మాత్రం ఫ్యాన్స్ సొంతంగా భారీ సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. మహబూబ్నగర్, సిద్దిపేట వంటి ప్రాంతాల నుంచి ఆటో, కార్లు మాట్లాడుకొని వచ్చి మరీ మ్యాచ్ చూశారంటే లీగ్కు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం’ అన్నారు.
ఈ సీజన్లో బ్లాక్హాక్స్ టీమ్ ఆరంభంలో మెరుగ్గానే ఆడిన తర్వాత ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమైందన్నారు. సొంతగడ్డపై పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానుల అంచనాలు పెరగడం కూడా దీనికి ఒక కారణం అన్నారు. ‘ఈ సీజన్ చాలా పోటీగా సాగింది. నాలుగో ప్లేస్కు, తొమ్మిదో ప్లేస్లో ఉన్న టీమ్కు మధ్య ఒక్క పాయింట్ తేడానే ఉంది. హోం గ్రౌండ్లో ఆడటం వల్ల సహజంగానే వచ్చే అంచనాల ఒత్తిడి వల్ల మా టీమ్ తడబడింది. కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు కూడా చేసింది. దీన్ని సమీక్షించుకొని వచ్చే సీజన్కు బలంగా తిరిగొస్తాం’ అని తెలిపారు.
